హైదరాబాద్, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): డిమాండ్లు, ఉద్యమాలు చేయకుండానే బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు బీసీలు రుణపడి ఉంటారని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు పేర్కొన్నారు. నాటువైద్యులు గా, క్షురక వృత్తిదారులుగా, మంగళవాయిద్యకారులుగా, పురుడు పోసే తల్లులుగా నాయీ బ్రాహ్మణుల సేవలు నిరుపమానమైనవని, ఈ జాతికి సమాజం ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉం టుందని చెప్పారు. రవీంద్రభారతిలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఆత్మగౌరవ మహాసభలో వకుళాభరణం మా ట్లాడుతూ.. బీసీలకు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 అని తెలిపారు. బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు, నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
నాయీ బ్రాహ్మణులకు కూడా రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో రెండు ఎకరాల భూమి, రూ.2 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వం సెలూన్లకు 250 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నదని, బీసీ కులవృత్తులకు చేయూతనందించేందుకు రూ.లక్ష సాయం చేస్తున్నదని వివరించారు. నాయీ బ్రాహ్మణుల డిమాండ్లు సమంజసమైనవేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాల ప్రతినిధులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కుల సంఘా ల ప్రతినిధులు ప్రజలకు మేలు చేసే దిశగా పని చేయాలని సూచించారు. సభలో నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాసనాయీ, టీటీడీ బోర్డు సభ్యుడు యానాదయ్య పాల్గొన్నారు.