హైదరాబాద్ : తెలంగాణ గడ్డ నుంచి బీసీల ధర్మపోరాటం ప్రారంభమైందని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో వకుళాభరణం కృష్ణమోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అన్నారు. 56శాతం ఉన్నా.. బీసీ మంత్రిత్వశాఖ లేకపోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ నేతృత్వంలో 2004లో అప్పటి ప్రధానిని కలిసి బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరామని, కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు.
నేటి బీజేపీ కనీసం ఆ డిమాండ్ను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బీసీలను మరింత అణగతొక్కెందుకు కుట్రలు చేస్తుందని, 45లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు రూ.900కోట్లనే కేటాయించేది అని ప్రశ్నించారు. బీసీ కులాలు ఎట్లా ఉన్నాయ్..? ఎలా బతుకుతున్నరు.. విద్యా, రాజకీయ రంగంలో వారి స్థానం ఏమిటి? అని తెలిస్తేనే బీసీలకు ఏం చేయాలనేది తెలుస్తుందన్నారు. అందుకే ఇప్పటికైనా కులగణన చేపట్టాలని, మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమ తరహాలో బీసీల పోరాటం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.