హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): సింగిడి రంగుల తల్లి బతుకమ్మ మెరిసింది. పల్లె పాట మురిసింది. ‘నమస్తే తెలంగాణ’, ‘విశ్వసాహితీ’ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ‘లక్ష’ వరాల బతుకమ్మ పోటీకి విశేష స్పందన లభించింది. అడవి పూలతల్లి చుట్టూ చిత్రీకరించిన వీడియోలు.. జానపద పరిమళాలు వెదజల్లుతూ, పల్లె తెలంగాణ ముచ్చటను అచ్చెరువొందేలా ఆవిష్కరించాయి. గ్రామీణ మహిళల ఆటపాటల మేళవింపు అయిన బతుకమ్మ సందడిని అద్భుతంగా చూపించాయి. కళాశాల విద్యార్థినుల కోలాటాల కోలాహలం పూలగౌరమ్మ ప్రాభవాన్ని తెలియజేసింది.
పల్లె నుంచి పట్నం దాకా వివిధ రంగాల స్త్రీమూర్తులు తమ ఇష్టదైవాన్ని స్మరిస్తూ చిత్రీకరించిన వీడియోలు తీరొక్క పూలబొమ్మకు సరికొత్త హంగులు అద్దాయి. పోటీకి విదేశాల నుంచి సైతం ఎంట్రీలు రావడం విశేషం. భారీ సంఖ్యలో వచ్చిన ఈ వీడియోల్లో వెల్లువెత్తిన సృజనాత్మకత బతుకమ్మ గీతాలకు పూర్వవైభవాన్ని వాయనంగా అందించింది. అద్భుతంగా నిర్మించిన బతుకమ్మ వీడియోలు యూట్యూ బ్ వేదికగా ట్రెండింగ్లో ఉన్నాయి. న్యాయనిర్ణేతలు ప్రకటించిన మార్కులతోపాటు అక్టోబర్ 25వ తేదీ వరకు వచ్చిన వ్యూస్, సబ్స్క్రిప్షన్స్ సంఖ్యను పరిగణనలోకి తీసుకొని విజేతలను నిర్ణయిస్తామని ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 27న రవీంద్రభారతిలో బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని, విజేతల వివరాలు అదేరోజు ప్రకటిస్తామని పేర్కొన్నారు.