హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని, మధుర జ్ఞాపకాల సంస్కృతి ఈ పండుగ సొంతమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం రచించిన ‘గునుగు పూలల్లో గౌరమ్మవై ఇలలో (బతుకమ్మ పాట లు) పురస్కారాలు, ‘అమ్మగీసిన బొమ్మను నేను’ గేయరచన అవార్డుల కార్యక్రమం గురువారం రవీంద్రభారతిలో జరిగింది. శాసనసభాపతి మాట్లాడుతూ బుర్రా వెంకటేశం రచించిన గేయాలు అందరి హృదయాలను అలరించాయని అన్నారు.
పలువురు వక్తలు తన ప్రసంగంలో.. బుర్రా వెంకటేశం రాసిన పాటలకు 250పైగా వీడియోలు రావడం అభినందనీయమన్నారు. వీడియోలు పంపించిన వారందరికీ ప్రశంసాపత్రాలు అందించారు. విశ్వసాహితీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 3 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ‘అమ్మ గీసిన బొమ్మను నేను’ గేయరచనకు మొదటి బహుమతి ఇందిరా ప్రియదర్శిని కళాశాల, మహేశ్వరం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల కళాశాల (రూ.50 వేలు), ద్వితీయ బహుమతి విజయనగరం కుసుమితకు (రూ.25వేలు), మూడో బహుమతి కేశంపేట మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల (రూ.15వేలు) అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సంగీత నాటక అకాడమీ చైర్మన్ పద్మజారెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణికుముదిని, ప్రజ్ఞాభారతి చైర్మన్ హనుమాన్ దరి, ప్రగతి గ్రూపుల చైర్మన్ జీబీకే రావు, శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాదరెడ్డి, ఎంపీ విజయేంద్రప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ, కొలకలూరి ఇనాక్, మామిడి హరికృష్ణ, మల్లయ్య బట్టు తదితరులు పాల్గొన్నారు.