సూర్యాపేట : శాంతి సామరస్యానికి, పరమత సహనానికి మహిళలు అందరూ కలిసి జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈ పండుగ ద్వారా తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఆడపడుచులకు చీరల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
సూర్యాపేటలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఆడ బిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ జాతికి మాత్రమే సొంతం అని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఏటా అందజేస్తున్న బతుకమ్మ కానుక చరిత్రాత్మకమని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పాలనలోనే మహిళలకు సముచిత గౌరవం దక్కిందని అన్నారు. వారి అభ్యున్నతికి దేశం లో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు టీఆర్ఎస్ పాలన చేసి కేంద్రంలోని బీజేపీ తట్టుకోలేకపోతుందన్నారు. ఆ కారణం తోనే టీఆర్ఎస్ ప్రభుత్వం పై మోదీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పూనుకుంటుందని ఆరోపించారు.
కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా దేవి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ పాల్గొన్నారు.