రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే వైద్యారోగ్యశాఖ భవిష్యత్తు ప్రణాళికలకు సరైన ప్రాతిపదిక అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పౌరుల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా లభించే సమాచారాన్ని విశ్లేషించడం వల్ల వివిధ జిల్లాల్లో ప్రత్యేకంగా ఉన్న వ్యాధులు, సీజనల్ వ్యాధుల హెల్త్ ట్రెండ్స్ను గుర్తించవచ్చు. తద్వారా ఆయా ఆరోగ్య సమస్యలకు అవసరమైన నివారణ, చికిత్సకు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది. రోడ్డు ప్రమాదాల వంటి సమయాల్లో అత్యవసర చికిత్స అందించేందుకు ఈ సమాచారం ఎంతగానో సాయపడుతుంది.
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారాన్ని సేకరించే ‘హెల్త్ ప్రొఫైల్’ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిని రూపొందించేముందు ప్రయోగాత్మకంగా చిన్న జిల్లాలైన ములుగు, రాజన్న సిరిసిల్లను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్తో కలిసి కేటీఆర్ గురువారం ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండు జిల్లాల్లోని వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటి వద్దే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరిస్తారని తెలిపారు. బీపీ, మధుమేహం, ప్రాథమిక రక్త, మూత్ర పరీక్షలను అకడికకడే నిర్వహిస్తారని అన్నారు. ఎవరికైనా అదనపు పరీక్షలు అవసరమని భావిస్తే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లకు పంపి, పరీక్షలు చేయిస్తారని వివరించారు. ఇందుకు ప్రాథమిక కేంద్రాల్లో అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చుతామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఐటీ, వైద్యశాఖ సమన్వయంతో భాగస్వాములు అవుతాయని అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఐటీశాఖ ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వ సేవలను ఆన్లైన్, మొబైల్ ప్లాట్ఫామ్పై అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. టెక్నాలజీ సహకారంతో ప్రజా సమస్యలను పరిషరించేందుకు, అత్యంత సులభంగా ప్రభుత్వ సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని చెప్పారు.
భవిష్యత్తు ప్రణాళికలకు సరైన ప్రాతిపదిక
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే వైద్యారోగ్యశాఖ భవిష్యత్తు ప్రణాళికలకు సరైన ప్రాతిపదిక అవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరుల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా లభించే సమాచారాన్ని విశ్లేషించడం వల్ల వివిధ జిల్లాల్లో ప్రత్యేకంగా ఉన్న వ్యాధులు, సీజనల్ వ్యాధుల హెల్త్ ట్రెండ్స్ను గుర్తించవచ్చని వెల్లడించారు. తద్వారా ఆయా ఆరోగ్య సమస్యలకు అవసరమైన నివారణ, చికిత్సకు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు వంటి సమయాల్లో అత్యవసర చికిత్స అందించేందుకు ఈ సమాచారం ఎంతగానో సాయపడుతుందని వివరించారు. ఇప్పటికే హెల్త్ ప్రొఫైల్ను పూర్తిచేసిన ఈస్టోనియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లాను ఎంచుకోవడం వల్ల స్థానికులకు అనేక ఉపయోగాలు కలుగుతాయని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. సమీక్ష సందర్భంగా మంత్రులు పలు సలహాలు, సూచనలు ఇవ్వగా, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మరో వారం రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందిస్తామని అధికారులు చెప్పారు. సమీక్షలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్, సీఎంవో ఓఎస్డీ గంగాధర్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.