హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): వానకాలం మక్కల విక్రయానికి ప్రభుత్వం తాజాగా మరోసారి టెండర్లు పిలిచింది. కాగా మార్క్ఫెడ్ టెండర్ ప్రక్రియలో తొలిసారి కొత్త నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. మక్కల టెండర్లకు బేస్ప్రైస్ (కనీస) ధర పెట్టాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగానే క్వింటాలుకు రూ.1700 కనీస ధర నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వేలంలో పాల్గొనే బిడ్డర్లు కనీస ధరకు పైగా బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. బిడ్ పెంపు ధర టన్నుకు కనీసం రూ.100గా నిర్ణయించింది. కనీస ధర విధానం తీసుకురావడంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ ధర ఎక్కువగా వచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ ప్రయోగం ఏ మేరకు ఫలితాన్నిస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ధరకు బిడ్డర్లు ముందుకొస్తారా..? లేదా..? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. తక్కువ ధర వచ్చిందనే కారణంతో మొన్నటి టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. 3.8 లక్షల టన్నుల మక్కల విక్రయానికి టెండర్లు పిలువగా సగటున క్వింటాలుకు రూ.1,410 చొప్పున ధర వచ్చింది. ఈ ధరతో విక్రయిస్తే మార్క్ఫెడ్కు రూ.400 కోట్లకు పైగా నష్టం వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆ టెండర్లను రద్దు చేసి మరోసారి టెండర్లు పిలిచారు. ఈ నేపథ్యంలో గత టెండర్లలో రూ.1410 ధర రాగా ఈ టెండర్లో కనీస ధరనే రూ.1700గా నిర్ణయించడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో మక్కలకు క్వింటాలుకు రూ.1600-రూ.1800 వరకు ధర ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.1700కు బిడ్డర్లు ముందుకొస్తారా అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.