సంగారెడ్డి, జూన్ 7 (నమసే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ఇలాంటి తరుణంలో రాష్ర్టాన్ని మరొకరి చేతిలో పెట్టే ప్రయత్నం చేయవద్దని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రజలకు సూచించారు. తెలంగాణలోని అన్నివర్గాల అభ్యున్నతికి దోహదపడుతున్న సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతుగా నిలవాలని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోమారు దీవించాలని కోరారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచల్మెడలో రూ.2,653 కోట్లతో నిర్మిస్తున్న సంగమేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన పంప్హౌస్ నిర్మాణానికి బుధవారం ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్రావు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. గోదావరి జలాలను సంగారెడ్డి జిల్లాకు తీసుకొచ్చి 4 లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందజేస్తామని, రెండు పంటలు పండే మాగాణంలా మారుస్తామని తెలిపారు. ఇది పూర్తయితే జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజక వర్గాల్లోని 2.19 లక్షల ఎకరాల్లో సిరులు పండుతాయని అన్నారు. రెండేండ్లలో సంగమేశ్వర ఎత్తిపోతలు పూర్తిచేసి ఈ ప్రాంతాలను కోనసీమలా మారుస్తామని చెప్పారు.
జిల్లాను ఎండబెట్టిన చరిత్ర కాంగ్రెస్ది
ఉమ్మడి పాలనలో సింగూరు ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సాగునీరు అందలేదని మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని భూములను ముంచి సింగూరు ప్రాజెక్టు కట్టి, ఈ నీళ్లు జిల్లా అవసరాలకు ఇవ్వకుండా హైదరాబాద్కు తరలించి జిల్లాను ఎండబెట్టిన చరిత్ర కాంగ్రెస్ది అని విమర్శించారు.