బాసర, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ ఉద్యోగులకు గతంలో ఒకటో తేదీనే వేతనాలు పడేవి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక రెండు నెలలుగా వేతనాలు ఆలస్యమవుతున్నాయి. 5వ తారీఖు దాటినా జనవరి నెల జీతాలు ఇంకా జమకాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అన్ని శాఖల ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వేసినట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తమకు మాత్రం ఇప్పటి వరకు వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ట్రిపుల్ ఐటీ వీసీ వెంకటరమణను వివరణ కోరగా ఆయన స్పందించలేదు. డైరెక్టర్ సతీశ్కుమార్ మాత్రం జీతాలు తమ పరిధిలోకి రావని, అకౌంట్స్ అధికారులు చూసుకుంటారని తెలిపారు.