Basara Temple | దక్షిణ భారతదేశంలోనే ఎంతో విశిష్టత కలిగిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం కొత్త రూపును సంతరించుకోనున్నది. ఆలయాన్ని పునర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కర్ణాటక శృంగేరి పీఠం నుంచి అనుమతి తీసుకుంది. ఆగమశాస్త్రం ప్రకారం మాస్టర్ ప్లాన్ రూపొందించగా.. శృంగేరి శారదా పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి, ఉత్తరాధికారి విధుశేఖర భారతీ తీర్థ స్వామి పరిశీలించి ఆమోదముద్ర వేశారు. ఆలయ పునర్నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే, ఇందులో ఇప్పటికే రూ.8కోట్ల వ్యయంతో ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాలు, తదితర పనులను చేపట్టింది.
రూ.22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం ఆలయ పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ జరుగనున్నది. శృంగేరి శారదా పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి, ఉత్తరాధికారి విధుశేఖర భారతీ తీర్థ స్వామి నిర్ణయించిన సుహూర్తం ప్రకారం.. సరస్వతి అమ్మవారి గర్భాలయ పునఃనిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, టీఎస్ఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి ఉదయం 8 గంటలకు భూమిపూజ చేయనున్నారు.
బాసరలో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లు కొలువుదీరి ఉన్నారు. గర్భగుడిలో మహా సరస్వతి విగ్రహానికి కుడివైపున మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటుంది. పైఅంతస్తులో మహంకాళి విగ్రహం ఉన్నది. సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించేలా ఉండాలని ఆగమ శాస్త్రం చెబుతున్నది. అయితే ఇప్పుడు భక్తులు ప్రత్యేకంగా చూస్తే తప్ప మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కనిపించడం లేదు. దాంతో ప్రస్తుతం ఉన్న ప్రాకార మండపాన్ని తొలగించి.. కొత్తగా నిర్మించేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.
ప్రాకార మండపానికి తూర్పు, పశ్చిమ దిశల్లో ఏడంతస్తులతో రెండు రాజ గోపురాలు, ఉత్తర, దక్షిణ దిశల్లో ఐదు అందస్తులతో మరో రెండు రాజ గోపురాలు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. ఇప్పుడున్న ప్రాకార మండపం మరో 50 మీటర్లు ముందుకు జరుగనుంది. ప్రస్తుతం 10 అడుగుల పొడవు 10 అడుగుల వెడెల్పుతో ఉన్న గర్భగుడి 25.5 అడుగుల వెడెల్పు, 16.5 అడుగుల పొడవుతో పునర్నిర్మించనున్నారు. 6.5 అడుగుల వెడెల్పున్న ఆలయ ముఖ ద్వారాన్ని 18.5 అడుగులకు పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నది ఇప్పటికే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కృష్ణ శిలలతో తీర్చిదిద్దింది. ఇటీవల కొండగట్టు ఆలయానికి సైతం రూ.100కోట్లు కేటాయించింది. అలాగే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సైతం చర్యలు తీసుకుంటున్నది.