హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రాష్ట్రంలోని బ్యాంకుల నగదు డిపాజిట్లు 110.11 నుంచి 117 శాతానికి పెరిగినట్టు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) అధ్యక్షుడు, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ వెల్లడించారు. 2021 డిసెంబర్ 31 నాటికి రాష్ట్ర బ్యాంకుల్లో రూ.603,548 కోట్ల డిపాజిట్లు, రూ.706,123 కోట్ల అడ్వాన్సులు ఉన్నట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఎస్ఎల్బీసీ త్రైమాసిక సమీక్షా సమావేశంలో జింగ్రాన్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.31,489 కోట్ల స్వల్పకాలిక రుణాలు, రూ.11,709 కోట్ల టర్మ్ రుణాలతోపాటు రూ.610 కోట్ల విద్యారుణాలు, రూ.3,259 కోట్ల గృహరుణాలు పంపిణీ చేసినట్టు చెప్పారు.
ప్రాధాన్య రంగానికి 80,710 కోట్లు
2021-22లో ప్రాధాన్య రంగానికి రూ.80,710 కోట్ల రుణాల పంపిణీతో వార్షిక లక్ష్యాల్లో 55.91 శాతం సాధించినట్టు జింగ్రాన్ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.32,210 కోట్లు, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద రూ.8,299 కోట్లు, ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద రూ.2,865 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్టు వివరించారు. 2020-21 నుండి 2023-24 వరకు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన రూ.3,075 కోట్ల లక్ష్యానికి గాను బ్యాంకులు రూ.266 కోట్లు మాత్రమే మంజూరు చేసినట్టు ఎస్ఎల్బీసీ వెల్లడించింది.