2022-23లో వచ్చిన కొత్త పరిశ్రమలు 2,518
వచ్చిన పెట్టుబడులు రూ. 20,237కోట్లు
ఉద్యోగావకాశాలు 72,908
వార్షిక రుణ లక్ష్యం: రూ. 2,42,775 కోట్లు
ప్రాధాన్య రంగానికి: రూ.1,85,326 కోట్లు
వ్యవసాయ రంగానికి: రూ.1,12,762 కోట్లు
ఎంఎస్ఎంఈలకు: రూ. 54,672 కోట్లు
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.12 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు బ్యాంకర్లు ప్రకటించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) 37వ సమీక్షా సమావేశం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన శుక్రవారం టీ హబ్లో జరిగింది. వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ లక్ష్యం రూ.2,42,775 కోట్లుగా నిర్ధారించడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది లక్ష్యం రూ.2.14 లక్షల కోట్లు కంటే ఈసారి 13.42% అధికంగా ఉండటం సంతోషకరమని చెప్పారు. ఈ ఏడాది రుణ లక్ష్యంలో ప్రాధాన్య రంగం వాటా రూ.1,85,326.68 కోట్లు కాగా ఇందులో అత్యధికంగా 60.85% (రూ.1,12,762.59 కోట్లు) వ్యవసాయ రంగానికి కేటాయించడం మంచి విషయమని అభినందించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికల వల్ల దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని వివరించారు. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 2014-15లో 4.1% ఉండగా 2022-23లో 4.8% పెరిగిందని గుర్తు చేశారు. రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, చేపపిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ తదితర పథకాల వల్ల వ్యవసాయం, అనుబంధ రంగాలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని తెలిపారు. 2014-15లో ప్రాథమిక రంగ స్థూల విలువ జోడింపు 16.3% ఉంటే, 2022-23కు 18.8% పెరిగిందని చెప్పారు. సాగు విస్తీర్ణం పెరగడం వల్ల పంట ఉత్పత్తి పెరిగి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అత్యధిక ధాన్యాన్ని సరఫరా చేస్తున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ‘డిజిటల్ డిస్టిక్స్’గా గుర్తింపు పొందడం గొప్ప విషయమని బ్యాంకర్లను అభినందించారు.
వ్యాపార అనుకూల ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని హరీశ్రావు తెలిపారు. దీనివల్ల పెట్టుబడులు పెరగడంతోపాటు ఉద్యోగావకాశాలు పెరిగాయని వివరించారు. టీఎస్ఐపాస్ వల్ల 2022-23లో 2,518 కొత్త పరిశ్రమల ద్వారా రూ.20,237 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని తెలిపారు. 72,908 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ఈ ఏడాది లక్ష్యం మేరకు రూ.54,672 కోట్లు ఎంఎస్ఎమ్ఈ పరిశ్రమలకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. చిరు వ్యాపారులకు రుణాలు అందించి అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి కోసం 60-90% దాకా సబ్సిడీలు అందిస్తున్నదని గుర్తు చేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్ఎల్బీసీ కన్వీనర్ దేబాశిష్ మిత్రా, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత్ కే, నాబార్డ్ సీజీఎం చింతల సుశీల, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, డీఎఫ్ఎస్ అదనపు కమిషనర్ తంగిరాల తదితరులు పాల్గొన్నారు.