ఖైరతాబాద్, జూన్ 15 : గిరిజనుల ఓట్లతో గద్దెనెక్కి, ఆ జాతికి ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయమని తెలంగాణ ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫోరం(టీజీటీఐఎఫ్) అధ్యక్షుడు ధనుంజయనాయక్ పేర్కొన్నారు. ఆదివారం లక్డీకాపూల్లోని సెంట్రల్ కోర్టులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల చేపట్టిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో గిరిజనులకు మంత్రి పదవి దక్కకపోవడం బాధాకరమని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా సేవాలాల్ జయంతి రోజున కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చింది బంజారాలేనని పేర్కొన్నారని, కానీ నేడు ఆ వర్గాలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, ఆ జాతి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఎస్టీ కమిషన్, తండాల అభివృద్ధికి డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి తమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.