బంజారాహిల్స్, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలిలో బంజారాలకు స్థానం కల్పించాలని ఆలిండియా బంజారా సేవాసంఘ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శనివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లో ఉన్న బంజారా భవన్లో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో సేవాసంఘ్ అధ్యక్షుడు ఇస్లావత్ రాంచంద్ర నాయక్ మాట్లాడారు.
రాష్ట్రంలో 10 శాతం ఉన్న గిరిజనుల్లో లంబాడాలు సుమారు 7 శాతం ఉన్నారని, వారికి మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కిషన్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి కేతావత్ సోన్లాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమన్ నాయక్, సుభాష్ నాయక్, రమావత్ విష్ణునాయక్, భూక్యా రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.