హైదరాబాద్, ఆగస్ట్28 (నమస్తే తెలంగాణ): ఒకనాడు కరువుతో అల్లాడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలు కేసీఆర్ సారథ్యంలో నేడు సస్యశ్యామలమయ్యాయని సినీనటుడు బండ్ల గణేశ్ హర్షం వ్యక్తం చేశారు. వలసలతో తల్లడిల్లిన పాలమూరు ప్రాంతం నేడు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మాదిరిగా పచ్చని పొలాలతో కళకళలాడుతున్నదని కొనియాడారు. ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని, అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఇటీవల వ్యక్తిగత పనిమీద నారాయణపేట జిల్లాకు వెళ్లిన సందర్భంగా ఆయా ప్రాంతాలను చూస్తే గోదావరి జిల్లాల తరహాలో పచ్చని పొలాలు కనువిందు చేస్తున్నాయని అన్నారు. చిన్నప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ను ఇప్పటి మహబూబ్నగర్తో పోల్చుకోలేమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కూడా అలాంటి పచ్చని అందాలు కనువిందు చేస్తున్నాయని కొనియాడారు.