ఇంతకీ బండి సంజయ్ దేవుడున్నాడని నమ్మి తడిబట్టల ప్రమాణం చేసిండా?
లేక లేడు, రాడనే నిగూఢ నమ్మకంతోనా?
దేవుడు లేడని, ఎక్కడున్నాడని హిరణ్య కశ్యపుడు ధిక్కరిస్తేనే కదా స్తంభం నుంచి స్వామి ఉద్భవించింది!
తెలుసా తడిబట్టల సంజయ్.. తస్మాత్ జాగ్రత్త!!
తెలంగాణ నిండా నర్సింహస్వాములున్నారు!
నాటకాలాడితే… నంజుకుతింటరు!!
దేవుణ్ని నమ్ముకునే వాళ్లు కొందరు. దేవుణ్నే అమ్ముకునే వాళ్లు కొందరు.
తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని దేశమే అబ్బురపడేలా పునర్నిర్మించారు కేసీఆర్.. అచంచలమైన భక్తితో, స్వామిమీద అనురక్తితో! ప్రచార ఆర్భాటం లేదు. ఫొటోల యావ లేదు. తన ప్రభుత్వం కట్టించిందనే ప్రకటన లేదు. వెనకటికి రాజులు గుడులు కట్టించి శాసనాలు రాసుకున్నరు. ప్రజాస్వామ్య భారతంలో ఎన్నడూ లేనంతటి నిర్మాణమైనా.. ముఖ్యమంత్రిగా ఉన్నా.. కేసీఆర్, కనీసం తన పేరుతో శిలాఫలకం కూడా పెట్టుకోలేదు! నిజమైన భక్తుడిగా నిండు మనసుతో మొక్కుకుని, మొక్కులు సమర్పించుకుని, స్వామిని సేవించుకునే పరిపూర్ణ సమర్పణ భావం తప్ప.. ఆయనలో ఇంకొక ఆలోచనే లేదు! ఇది మనందరం చూసిన నిజం!
అటువంటి అద్భుత దేవాలయంలో… అత్యంత శక్తిశాలి, అసుర భంజనుడైన యాదాద్రి స్వయంభూ స్వామి ముందు అక్టోబర్ 28న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తడిబట్టలతో పెద్ద తప్పు చేశారు.
‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసిన నిందితులతో బీజేపీకి ఏ సంబంధమూ లేదని! అసలు వాళ్లెవరో తమకు తెల్వనే తెల్వదని’! బండి సంజయ్ ప్రమాణం చేశారు. పచ్చి బట్టలతో పచ్చి అబద్ధాలు!
తెలంగాణలో ఎవడైనా, ఎంతటి మొనగాడైనా తడిబట్టలతో ఇమానం, ప్రమాణం చేస్తడా? పచ్చిబట్టలతో గుళ్లె జొస్తడా? దేవుని పాదాల మీద పూలు తీస్తడా? ఎంతటి దుస్సాహసం. తడిబట్టల ప్రమాణం చెయ్యిమంటే.. తప్పు చేయకున్నా సరే, తప్పైందని ఒప్పుకొని, దడవతో దండుగో కట్టి తప్పుకుపోయే పశ్చాత్తాప పరంపర మనది. అటువంటి పాపభీతి మన సంస్కృతి!
మరి, బండి సంజయ్ది ఏ వికృతి? మతం పేరుతో అమాయక ప్రజలను మాయ చేసినట్టు, ప్రమాణం పేరుతో యాదాద్రి స్వామిని మాయ చేయజూసిండు! నర్సింహస్వామితోనే నాటకాలాడిండు. స్వామి ఊరుకుంటడా! గుట్ట దిగేలోపు పుట్ట పగిలింది!
ఆ ముగ్గురు బ్రోకర్లు బీజేపీ వాళ్లేనని, వాళ్ల వెనక బీజేపీకి, ఆరెస్సెస్కు చెందిన అనేక మంది పెద్దలు, టాప్ 1, 2, 3లు ఉన్నారని తేటతెల్లమవుతున్నది. పాముల పుట్టలోంచి కాలనాగులు బయటపడుతున్నట్టు, కాల్డాటాలోంచి గుట్టలకొద్ద్దీ ఫొటోలు, గంటలకొద్దీ సంభాషణలు, టెర్రాబైట్ల కొద్దీ టెక్ట్స్ మెసేజ్లు, వందలాది వాయిస్ రికార్డులు మీడియా పరిశోధనలో బయటపడుతున్నాయి. బ్రోకర్లతో బీజేపీకి సంబంధం లేదని, వాళ్లెవరో తనకు తెల్వదనీ చెప్పిన బండి సంజయ్కి కూడా వారితో సన్నిహిత సంబంధాలున్నట్టు కాల్డాటాపై మీడియా పరిశోధనలో బయటపడుతున్న ఆధారాలు వెల్లడిస్తున్నాయి. మరి సంజయ్ తడిబట్టల ప్రమాణం సంగతి?
బండి సంజయ్కి, ఆయన సన్నిహితుడు అడ్వకేట్ శ్రీనివాస్లకు ఎమ్మెల్యేల ఎర కేసు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందు, ప్రతాప్ తదితరులతో ఉన్న సంబంధాల చిత్ర మాలిక
‘నర్సింహస్వామి మీద ఒట్టుపెడితే నాశనమైపోతరు’.. అని తెలంగాణ పల్లెజనులు బలంగా నమ్ముతరు. యాదగిరిగుట్ట నర్సన్న అంత పవర్ఫుల్. ఆయన కృపానిధే కాదు. పాపుల పాలిట ఉగ్రరూపుడే. అబద్ధాలాడి గడప తొక్కితే.. తొక్కి నారతీసే నారసింహుడాయన. అలాంటి దేవుడితోనే పరాచికాలా?
కేసీఆర్ ఎట్ల కట్టించారు గుడిని? ఎంత భక్తిశ్రద్ధలతో, ఎంత చిత్తశుద్ధితో దాని నిర్మాణాన్ని పూర్తిచేశారు? పొయ్యిమీదికి పోనుకిత్తులు లేనోడు కూడా పోకడ పొయ్యే కాలంలో.. ఎక్కడా ప్రచారం కోరుకోకుండా దైవసంకల్పంగా దాన్ని భావించారు కాబట్టే, అతితక్కువ కాలంలో అత్యద్భుత కట్టడంగా దానిని నిర్మించగలిగారు. తెలంగాణ మొక్కును చెల్లించుకున్నరు.
అక్టోబర్ 28, 2022.. పవిత్రస్థలిలో పాపపంకిలాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూసి విస్తుపోయిన రోజది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో పట్టుబడిన రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బండి సంజయ్ ప్రకటించారు. అంటితో ఆగలేదు. యాదాద్రి గుడిముందు కలశం చెంబులతో స్నానంచేసి వారెవరో తమకు తెలీనే తెలియదని నిస్సిగ్గుగా ప్రమాణం చేసిండు.
అది అసత్యమైనా, దేవుడు నోరు విప్పడనేనా ఆయన ధీమా!
నిందితులు అందరూ బండికి తెలుసు. నందు స్వయంగా బీజేపీ కార్యకర్త. ఆయనతో బండి దిగిన ఫొటోలు ఉన్నాయి. మరో బీజేపీ కార్యకర్త ప్రతాప్తోనూ సంజయ్ దిగిన ఫొటోలెన్నో. ఈ కేసులో మరో నిందితుడిగా చెబుతున్న విజయ్ మాదిగతోనూ ఆయన దిగిన ఫొటోలున్నాయి. ఒక్కటి నిజం. వాళ్లు అత్యంత సన్నిహితులు. బ్రోకర్లకు విమాన టిక్కెట్లను బుక్ చేసిన నిందితుడు శ్రీనివాస్కి బండి సంజయ్ని బావా అని నోరారా పిలుచుకునేంత చనువు! నందుతో కలిసి అనేక సందర్భాల్లో వారంతా కలగలసి తిరిగారు. మందు పార్టీలు చేసుకున్నారు. షాంపేన్లు పొంగించుకున్నారు. ఒకరి నోట్లో ఒకరు కేకులు కుక్కుకున్నారు. తీర్థయాత్రలకు తిరిగారు. స్వామీజీలను కలిశారు. వారిది ఎంత అన్యోన్య బంధమో బయటపడిన ఫొటోలే చెప్తున్నాయి. అనేక ఏండ్లుగా వారి మధ్య పరిచయం ఉన్నట్టుగా ఆ ఆడియో రికార్డుల్లోని సాన్నిహిత్య సంభాషణలే పట్టి చూపుతున్నాయి. అయినా, తనకేమీ తెలవదని అంటారు సంజయ్. తనకెవరూ పరిచయం లేరంటారు. అవసరమైతే తడిబట్టలతో మరోసారి ప్రమాణానికీ సిద్ధమవుతారేమో!
ప్రమాణం చేసి అంతా అబద్ధమే చెప్తాను..
ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ బ్రోకర్లుగా వచ్చినవారు మొయినాబాద్ ఫాంహౌస్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత.. వారితో బీజేపీకి ఏ సంబంధమూ లేదంటూ అక్టోబర్ 28న యాదాద్రి నర్సింహస్వామి సన్నిధిలో తడిబట్టలతో ప్రమాణం చేస్తున్న బండి సంజయ్.
బండికి అండగా..
ఎమ్మెల్యేలకు ఎర కేసులో 3వ నిందితుడిగా ఉన్న నందకుమార్తో బండి సంజయ్. ఈయనెవరో తనకు తెలియదంటూనే సంజయ్ యాదాద్రిలో తడిబట్టలతో ప్రమాణం చేసిండు.
షాంపేన్లా పొంగిన స్నేహం
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పేర్లు వినిపిస్తున్న ముగ్గురు నందకుమార్, ప్రతాప్, అడ్వకేట్
శ్రీనివాస్కు విందులు కొత్తేమీ కాదు. ఓ పార్టీలో ఇలా షాంపేన్ పొంగించి, కేకులు తినిపించుకుంటున్న దృశ్యమిది. పరిచయాల పరిధిని దాటిన గాఢమైన స్నేహం తమదని ఇలా చెప్పకనే చెప్తున్నారు.
సింహయాజితో వివేక్, విజయ్
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సింహయాజిని కలిసిన సందర్భంలో బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి, బీజేపీ దళిత నాయకుడు విజయ్
తుషార్తో తస్వీర్
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను తెరవెనుక ఉండి నడిపించిన నిందితుడు తుషార్ వెల్లపల్లితో బీజేపీ దళిత నాయకుడు విజయ్. బీఎల్ సంతోష్ నివాసానికి నందకుమార్తో కలిసివెళ్లిన సందర్భంగా వారు ఇలా ఫొటో దిగారు.
సింహయాజితో స్నేహబంధం
ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను అమలు చేసేందుకు యత్నించిన ఇద్దరు ప్రధాన నిందితులను ఈ ఫొటోలో చూడొచ్చు. ఏ2గా ఉన్న సింహయాజితో, ఏ3గా నందకుమార్ . గతంలో ఆయన హైదరాబాద్ వచ్చిన సందర్భంలోనిదీ ఫొటో. సింహయాజికి టికెట్ బుక్ చేసిన అడ్వకేట్ శ్రీనివాస్ కూడా ఈ చిత్రంలో ఉన్నారు.
చిద్విలాసంగా..
బీజేపీ దళిత నాయకుడు విజయ్.. నందకుమార్, అడ్వకేట్ శ్రీనివాస్, ప్రతాప్లతో కలియదిరిగేవాడని తెలుస్తున్నది. సింహయాజిని కలిసిన ఓ సందర్భంలో విజయ్..
లక్ష్మణ్తో విజయ్
బీజేపీలో విజయ్కి సంబంధాలు సాధారణమైనవి కావు. ఎంపీ లక్ష్మణ్ను కలిసిన ఓ సందర్భంలో ఆయనకు శాలువా కప్పి సత్కరిస్తున్న బీజేపీ దళిత నాయకుడు విజయ్.
బావతో సెల్ఫీ
ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన నిందితుడు సింహయాజికి విమాన టిక్కెట్ బుక్ చేసింది అడ్వకేట్ శ్రీనివాస్. బండి సంజయ్ ఇంట్లో కలియదిరిగే శ్రీనివాస్.. ఆయనను బావా అంటూ నోరారా పిలుస్తారని సన్నిహితులు చెప్తుంటారు.
బండితో మాటామంతీ
బీజేపీలో దళిత నాయకుడిగానే కాకుండా, పార్టీ రాష్ట్ర నాయకత్వంలో విజయ్కి మంచి పట్టు ఉందని తెలుస్తున్నది. బండి సంజయ్తో ముచ్చటిస్తున్న బీజేపీ దళిత నాయకుడు విజయ్.
నేటి ఏ1తో నాటి ఫొటో
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ బ్రోకర్గా వచ్చి పోలీసులకు దొరికిపోయిన రామచంద్రభారతిని చిత్రంలో చూడొచ్చు. గతంలో ఆయనను కలిసిన ఓ సందర్భంలో బీజేపీ దళిత నాయకుడు విజయ్ దిగిన ఫొటో ఇది.
స్వాములతో సన్నిహితంగా..
రామచంద్రభారతి, సింహయాజి.. ప్రధాన నిందితుల్లో ఇద్దరు. వారితో సంబంధం లేదని బీజేపీ ఎంత మొత్తుకున్నా, బయటపడుతున్న వందలాది ఫొటోలే నిజాన్ని చాటుతున్నాయి. ఆర్సీబీ, సింహయాజితో కిషన్రెడ్డి అనుచరుడు ప్రతాప్ .