నల్లగొండ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనతో పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు. నార్కట్ పల్లి మండల కేంద్రంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం పేరుతో పర్యటన చేస్తున్న బండి సంజయ్ రైతులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు.
వానకాలానికి సంబంధించిన మొత్తం వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని ఎప్పుడో ప్రకటించాం. ఆ దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు కూడా చేస్తుందన్నారు. కానీ బండి అర్థం పర్థం లేని పర్యటనలు చేస్తూ రైతుల్ని గందరగోళంలోకి నేట్టేస్తున్నాడని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
మొదటిగా కేంద్ర ప్రభుత్వం యాసంగి పండించే పంటను కొంటుందా లేదా అన్న విషయం స్పష్టంగా చెప్పిన తర్వాత రైతుల వద్దకు రావాలని ఆయన డిమాండ్ చేశాడు. మీరు ఎఫ్సీఐ నుంచి కొనుగోలు చేయకుండా మాపై బురద చల్లడం సరైన పద్ధతి కాదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతుల ముందు బద్నాం చేయడానికి ఈ మోసపూరిత పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి, ఎంపీటీసీ మేకల రాజి రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సట్టు సత్తయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూరు శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ బాజ యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.