అమిత్ షా సభకు మైదానం నింపాలని నేతలకు హుకుం
ఇన్నాళ్లూ పట్టించుకోలేదేం అంటూ సీనియర్ నేతల గుర్రు
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో శనివారం నిర్వహించనున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగిం పు సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా టెన్షన్ పడుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 5వ తేదీన మహబూబ్నగర్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్షల మంది హాజరవుతారని నడ్డా ముందు ఊదరగొట్టినా.. వాస్తవంలో సీన్ రివర్స్ అయ్యింది. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ వరంగల్లో నిర్వహించిన సభకు అంతకన్నా ఎక్కువ జనం వచ్చారు. దీంతో బీజేపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
అమిత్ షా సభ కూడా నడ్డా సభ మాదిరిగా ఫ్లాప్ కావొద్దని బండి సంజయ్ భావిస్తున్నారని సమాచారం. ఇటీవల ముఖ్యనేతల సమావేశంలో ‘రాహుల్గాంధీ సభను మించిపోవాలి’ అని బండి స్వయంగా చెప్పడమే ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఎలాగైనా జనసమీకరణ చేయాలని, మైదానం నింపాలని నేతలకు హుకుం జారీచేశారు. అందుబాటులో ఉన్న డాటా ప్రకారం ప్రతి ఒక్కరికీ ఎస్ఎంఎస్ రూపంలో, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ‘తుక్కుగూడకు తరలిరండి’ అని విన్నవిస్తున్నారు. మరోవైపు.. పార్టీ కీలక నేతలు బండిపై గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఇన్ని రోజులు ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం క్రెడిట్ బండి సంజయ్ వర్గమే తీసుకున్నదని.. యాత్ర చివర్లో మాత్రమే మా అవసరం వచ్చిందా? అంటూ వారు అసహనం వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. బండి సంజయ్ ఎవరితో మాట్లాడాలో, ఏమేం మాట్లాడాలో అంతా ‘ఆ వర్గమే’ చూసుకున్నదని, అలాంటప్పుడు జనసమీకరణ బాధ్యత కూడా వారే తీసుకోవాల్సిందని కొందరు బాహాటంగానే ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ‘పేరు వచ్చే దగ్గర వాళ్లు.. పైసలు ఖర్చు పెట్టే దగ్గర మేమా?’ అనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ బండి సంజయ్పై ఒత్తిడిని పెంచుతున్నాయని సన్నిహితులు చెప్తున్నారు.