కేటీఆర్ వివరణతో తోకముడిచిన కమలదళం
హైదరాబాద్, సెప్టెంబర్24 (నమస్తే తెలంగాణ): నోటి దురుసుకు కేరాఫ్ అడ్రస్గా మారిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మంత్రి కేటీఆర్ లక్ష్యంగా దాడి చేయబోయి.. అది బెడిసికొట్టడంతో తోక ముడిచారు. తెలంగాణ ఆరోగ్య కార్యకర్తలు పొలాల వద్దకే వెళ్లి పొలం పనులు చేసుకుంటున్న వారికి టీకాలు వేస్తున్న చిత్రాలను ఈనాడు, సాక్షి పత్రికలు ఇటీవల ప్రచురించాయి. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఆరోగ్య సిబ్బంది ఎంతో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని, పంట పొలాల వద్దకే వెళ్లి కొవిడ్ టీకాలు వేస్తున్నారని వారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఉద్యోగుల అంకితభావానికి ఈ చిత్రాలు నిదర్శనమని పేర్కొన్నారు. అయితే ఆ ఆరోగ్య కార్యకర్తలను ఆంధ్రప్రదేశ్కు చెందినవారుగా పేర్కొని తప్పులో కాలేసిన బండి సంజయ్ ‘ఏపీ ప్రభుత్వం చేసిన పనికి కేటీఆర్ క్రెడిట్ తీసుకుంటున్నారు’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. యథారీతిగా కమలదళం దీనికి వంత పాడటం మొదలుపెట్టింది. దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. అసలు జరిగిన వాస్తవమేమిటో వివరించడంతో పాటు, ఈసారి ఆ ఫొటోలతోపాటు ఆ పత్రికలు ప్రచురించిన వార్తల క్లిప్పింగ్లను కూడా జతచేశారు. దీంతో బండితో పాటు, కమలదళం తోకముడిచింది.