బేరసారాల బ్రోకర్లతో సంబంధం లేదు లేదంటూనే బీజేపీ నేతలు ఎందుకు తత్తరపడుతున్నారు?
రోజుకో టీవీలో ఎందుకు గాయిగత్తర చేస్తున్నారు?
తడిబట్టల ప్రమాణాలను పక్కనబెట్టి నిందితులను కాపాడటానికి కోర్టుల్లో ఎందుకు పిటిషన్లు వేస్తున్నారు?
దొంగ స్వాముల కొమ్ము కాయడానికి ఎందుకు ఆరాటపడుతున్నారు? నిందితులను పోలీసుల కస్టడీకి ఇవ్వొద్దు, సిట్ విచారణ వద్దేవద్దంటూ కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారు? ఎందుకంటే ఎమ్మెల్యేల కొనుగోళ్లలో వాళ్ల పార్టీ పాత్ర నిజం. దళారులు పలికింది పచ్చినిజం. నిందితుల కాల్డాటా ఆధారంగా విచారణ జరుపుతున్న పోలీసులకు దేశం నివ్వెరపోయే నిజాలు తెలుస్తున్నాయి. బీజేపీ పునాదులు కదిలిపోయే సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమీప బంధువైన కరీంనగర్కు చెందిన ఓ న్యాయవాదికి కమల్ ఫైల్స్లో పాత్ర ఉన్నదనే విషయం విశ్వసనీయంగా తెలిసింది. నిందితుల్లో ఒకరైన నందకుమార్తో అక్టోబర్ 14న న్యాయవాది సుమారు అరగంట పాటు సంభాషణలు జరిపినట్టు కాల్ డాటా విశ్లేషణలో తేలిందని సమాచారం. అక్టోబర్ 26న తిరుపతి నుంచి సింహయాజికి టికెట్ బుక్ చేసిందీ ఇతడేనని తెలిసింది.
హైదరాబాద్, నవంబర్11 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన వ్యవహారం రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నది. సిట్ విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపిన రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ను సిట్ రెండోరోజైన శుక్రవారం కూడా విచారించింది. విచారణలో నిందితులు వెల్లడిస్తున్న వివరాలు, వారి కాల్డాటాను విశ్లేషిస్తున్న సందర్భంగా వెలుగుచూస్తున్న లింకులను చూసి సిట్ బృందం ఆశ్చర్యపోతున్నది. తొలిరోజు 42 అంశాల ప్రశ్నావళిని ముందుపెట్టి, నిందితుల నుంచి సమాధానాలను రాబట్టడంలో అధికారులు విజయవంతమైనట్టు సమాచారం. ఈ కేసులో నిపుణులైన పోలీసులు కాల్డాటాను విశ్లేషిస్తుండగా, ఢిల్లీలో స్విచ్ వేస్తే కరీంనగర్లో బల్బు వెలిగింది. ఢిల్లీ బీజేపీ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఈ ఆపరేషన్లో పరోక్షంగా పాలుపంచుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కమల్ ఫైల్స్లో నేరుగా పాల్గొనకుండా బంధువులు, సన్నిహితులతో కథ నడిపించారని సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోళ్లతో తమకేమీ సంబంధం లేదని రోజుకో ప్రెస్మీట్ పెడుతూ, విచారణను ఆపేందుకు కోర్టు మెట్లు ఎక్కుతూ, గుళ్లలో ప్రమాణాలు చేస్తూ అష్టకష్టాలు పడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మైండ్ బ్లాంక్ అయ్యే అధారం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితుల్లో ఒకరైన నందకుమార్తో బండి బంధువైన కరీంనగర్ న్యాయవాది అక్టోబర్ 14న అరంగంటపాటు ఫోన్లో మాట్లాడినట్టు కాల్డాటా నిపుణులు తేల్చారని విశ్వసనీయ సమాచారం. అక్టోబర్ 26న సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు ఫ్లైట్ టికెట్ బుక్చేసిన ఆధారాలు లభించాయని పోలీసువర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఆడియో టేప్స్ బయటికి వచ్చినప్పటి నుంచి సదరు న్యాయవాది కోర్టుకు కూడా వెళ్లటం లేదని సమాచారం. మరికొందరు రాష్ట్ర బీజేపీ నేతలు ఈ ఆపరేషన్కు పరోక్షంగా సహకరించారనే ఆధారాలు కూడా ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. బండి ప్రమేయం లేకుండా బంధువు సొంతంగా ఈ వ్యవహారం నడిపే అవకాశమే లేదని, అయినా తడిబట్టలతో ఎలా ప్రమాణం చేశాడన్న చర్చ కొనసాగుతున్నది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆధారాలు కేసీఆర్కు ఎక్కడివి? ఆయనెలా బయటపెడతారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తుండటం వారి అజ్ఞానానికి నిదర్శనమని న్యాయనిపుణులు అంటున్నారు. రోహిత్రెడ్డి ఇచ్చిన సమాచారంతో పక్కాప్లాన్ ప్రకారం పోలీసులు ఆడియో, వీడియో ఆధారాలు సేకరించారు. అవి నిజమైనవేనని ఫోరెన్సిక్ ల్యాబ్లో నిర్ధారించుకున్నాకే హైకోర్టుకు, ఏసీబీ కోర్టుకు సమర్పించారు. సాక్ష్యాలను కోర్టులో డిపాజిట్ చేశాక అది పబ్లిక్ ప్రాపర్టీ అవుతుందని, కేసులోని రెండు పార్టీలకు కోర్టు ఇస్తుందని న్యాయ నిపుణులు తెలిపారు. ఫిర్యాదుదారుడైన రోహిత్రెడ్డి నుంచి సీఎంకు చేరాయని, వాటినే ప్రెస్మీట్లో చూపారని స్పష్టంచేశారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ కస్టడీలోకి తీసుకొన్న ముగ్గురు నిందితుల విచారణలో రెండోరోజైన శుక్రవారం కొత్తకోణం బయటపడింది. ఎంపీల కొనుగోలుకు కూడా బేరం పెట్టినట్టు తెలిసింది. తన బంధువు, కర్ణాటక సరిహద్దు ఎంపీతో నందకుమార్ బేరసారాలకు ప్రయత్నించినట్టు తెలిసింది. ‘ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బుట్టలో వేయాలి. ఇది సక్సెస్ కాగానే మా జాబితాలో ఉన్న మరింత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో రహస్య సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. కానీ మేమే ఎమ్మెల్యేల ట్రాప్లో పడిపోతామని ఉహించలేదు’ అని నిందితులు వెల్లడించినట్టు తెలిసింది. చంచల్గూడ జైలు నుంచి నిందితులను రెండోరోజు విచారణకు ముందు నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ ల్యాబ్)కు తీసుకెళ్లి స్వర నమూనాలు సేకరించారు. నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్కు సిట్కు నేతృత్వం వహిస్తున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బృందం శుక్రవారం సైతం అనేక ప్రశ్నలు సంధించింది. వీరి వద్ద రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన 55 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రముఖ నేతల పేర్లు ఉన్నట్టు సమాచారం. కర్ణాటక, మధ్యప్రదేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ లింకులు ఉన్నట్టు తెలిసింది.
నిందితులు ముగ్గురిని శుక్రవారం రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయానికి తరలించి విచారించారు. గురువారం అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానం రాకపోవడంతో రెండోరోజు సాంకేతిక ఆధారాలను ముందుపెట్టగా, కుట్రచేసిన మాట వాస్తవమేనని నిందితులు ఒప్పుకున్నట్టు తెలిసింది. తమకు భారీ అఫర్ ఇచ్చారని, అందుకే నేరుగా హైదరాబాద్కు వచ్చి ఎమ్మెల్యేలతో మాట్లాడామని వారు వెల్లడించినట్టు సమాచారం. ఈ అపరేషన్ సక్సెస్ చేయాలని ఢిల్లీలోని బీజేపీ కీలక నేతలు ప్రోత్సహించారని చెప్పినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలకు మేం వందకోట్లు ఇస్తామంటే ఎవరూ నమ్మరని, అందుకే అపరేషన్ను అప్పగించిన వారితోనే ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం చేశామని.. కొందరితో మాట్లాడించామని నిందితులు వెల్లడించినట్టు సమాచారం. తమది పెద్ద నెట్వర్క్ అని, అందులో ఒక్కొకరు ఒక్కో పనిచేస్తారని, ఢిల్లీ బీజేపీ పెద్దలే ఆ నెట్వర్క్ను నిర్వహిస్తారని వివరించినట్టు తెలిసింది. చాలా విషయాలు బయటకు రావాల్సి ఉన్నందున నిందితులను మరో 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఇప్పటికే సేకరించిన వివరాలతో సిట్ నివేదిక తయారుచేసింది. ఫామ్హౌస్లో ముగ్గురు నిందితులు ఢిల్లీ, యూపీ, బెంగుళూరులో ఉన్నవారితో మాట్లాడారు. నేరుగా బీజేపీ నేతలతో మాట్లాడించినందున.. అక్టోబర్ 26న ఫోన్లో మాట్లాడిన సమయంలో అవతలివైపు మాట్లాడిన వ్యక్తులను నిర్ధారించేందుకు టవర్ లోకేషన్, ఆ సమయంలో ఎవరితో మాట్లాడారనే విషయాన్ని కూడా సిట్ రాబడుతున్నట్టు తెలిసింది.