న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 31: ‘బండి సంజయ్.. నువ్వు గుట్కాలు తిని జైలుకెళ్తే.. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెత్తందారులను ఎదిరించి మేం జైలుకు వెళ్లాం. నీ తాటాకు చప్పుళ్లకు బెదిరే వాళ్లెవరూ లేరు’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులను అవమానపరిస్తే మంచిగుండదని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సోమవారం మాట్లాడారు. ప్రజలకు మొహం చూపించలేక నియోజకవర్గంలో బీజేపీ బహిరంగ సభను రద్దు చేసుకున్నదని తెలిపారు. ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మైండ్ బా్ంలక్ అయ్యిందని, దీంతో ఆయన పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
నిరాశ నిస్పృహలతో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఓ సైకోలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. అందుకే ఉద్యోగులపై, తెలంగాణ ఉద్యమకారులైన తమలాంటి వారిపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘం నాయకులపై చేసిన ఆరోపణలను బండి సంజయ్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు తాము, తమ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. వీరి వైఖరి పట్ల మునుగోడు ప్రజలంతా గుర్రుగా ఉన్నారని, ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించేందుకు కంకణం కట్టుకున్నారని తెలిపారు. బీజేపీ కుటిల రాజకీయాలను ఎండగట్టాలని, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.