Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధమని, సీఎం రేవంత్ రెడ్డి పెద్ద అబద్ధాలకోరని ఫైరయ్యారు. మహారాష్ట్ర వెళ్లి ప్రచారం చేయడం కాదని, దమ్ముంటే తెలంగాణలో ప్రచారం చేయాలని సవాల్ విసిరారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మూసీ నది ప్రక్షాళన అంటూ పాదయాత్ర చేయడం కాదని, ఆరు గ్యారెంటీలు అమలు చేశామంటూ పాదయాత్ర చేయగలుగుతారా..?’ అని బండి ఛాలెంజ్ చేశారు.
బండి ఇంకా ఏమన్నారంటే.. ‘మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ భారీ యాడ్ ఇచ్చింది. మరి తెలంగాణలో అమలు చేశామని చెప్పుకుంటున్న 6 గ్యారెంటీల ప్రస్తావన అందులో ఎందుకు లేదు..? మహిళలకు రూ.2,500 ఇచ్చారా..? తులం బంగారం, స్కూటీ ఇచ్చారా..? రైతులకు రూ.500 బోనస్ ఇచ్చారా..? వ్యవసాయ శాఖ మంత్రే స్వయంగా ఇంకా 2 లక్షల మందికి రుణమాఫీ చేయాలని అన్నారు కదా.. మరి వాళ్లందరికీ రుణమాఫీ చేశారా..? రైతు భరోసా రెండో విడత ఇచ్చారా..? తరుగు, తాలు, తేమ ప్రస్తావన లేకుండా పండించిన ప్రతి గింజ కొటాం అన్నారు. మరి కొంటున్నారా..? ఆసరా పించన్లు రూ.4 వేల చొప్పున ఇస్తామన్నారు. మరి ఇచ్చారా..? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. చేశారా..? రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చారా..?’ అని ప్రశ్నించారు.
‘విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఇచ్చారా..? ఇవన్నీ 6 గ్యారెంటీల్లో భాగమే కదా..? కాదని చెప్పగలరా..? మరి ఎందుకు ఇవ్వలేదు..? ఇవ్వకుండా ఇచ్చామని అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు..?’ అని బండి నిలదీశారు. మహారాష్ట్ర వెళ్లి గ్యారెంటీలన్నీ అమలు చేశామంటూ రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడని, తాము కూడా అక్కడకు వెళ్లి కాంగ్రెస్ బండారం బయటపెడతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే 60 శాతం మంది రైతులు తమకు రుణమాఫీ అందలేదని చెప్పారని, అందుకే ఆ సర్వే రిపోర్టులు బయటకు రిలీజ్ చేయడం లేదని మండిపడ్డారు.
హిమాచల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పి కర్ణాటక ప్రజలను మోసం చేసి గెలిచిన కాంగ్రెస్.. కర్ణాటకలో అమలు చేస్తున్నామని చెప్పి తెలంగాణలో గెలిచిందని బండి ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ మహారాష్ట్రలో కూడా అదే అబద్ధం చెప్పి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోందని ఆయన మండిపడ్డారు. కానీ హర్యానా ప్రజలు ఎలాగైతే కాంగ్రెస్ కుట్రను కనిపెట్టి కర్రు కాల్చి వాత పెట్టారో.. మహారాష్ట్రలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు.