హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాజకీయ నాయకుడు ఏదైనా మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. కనీసం కండ్ల ముందున్న నిజాలనైనా గుర్తించాలి. కానీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఇవేమీ పట్టవు. అడ్డూ అదుపు లేకుండా అబద్ధాలాడటం ఆయన నైజం. ఇప్పుడు ఇవి శ్రుతిమించి ‘చెత్త’ వ్యాఖ్యలకు దిగాడు. హైదరాబాద్లోని జవహర్నగర్ డంపింగ్ యార్డుపై అడ్డగోలుగా అభాండాలు వేశారు. ఆ డంపింగ్ యార్డు ఉమ్మడి పాలనలో ఎలా ఉన్నది? తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎంత పచ్చదనాన్ని నింపుకొన్నది? అన్న కనీసం సోయి లేకుండా గురువింద గింజలా మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే సమస్యను పరిష్కరిస్తానంటూ తన అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చెత్త సమస్యను పరిష్కరించలేక అక్కడి ప్రభుత్వాలు చతికిలబడితే.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జవహర్నగర్లో దుర్వాసనను నియంత్రించి ఆ ప్రాంత ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించింది. అంతేకాకుండా చెత్త నుంచి 20 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నది. త్వరలో ఈ ఉత్పత్తిని 100 మెగావాట్లకు పెంచే దిశగా అడుగులు వేస్తున్నది. కానీ, గుజరాత్లో అహ్మదాబాద్, కర్ణాటకలో బెంగళూరు సహా పలు ప్రాంతాలు ఎన్నో ఏండ్ల నుంచి చెత్త గుట్టలతో మురికి కూపాలుగా కొనసాగుతుండటంతో అక్కడి ప్రజలు దుర్గంధంతో అల్లాడుతున్నారు. ఈ కఠోర వాస్తవాలను బండి సంజయ్ విస్మరించి హైదరాబాద్పై లేనిపోని అభాండాలు వేయడం ఆయన నైజాన్ని చాటుతున్నది.
వ్యర్థాలతో వెలుగులు
వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో జీహెచ్ఎంసీ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నది. జవహర్నగర్ వద్ద ప్లాంటు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నిత్యం 1,500-1,600 టన్నుల చెత్తను రెండు బాయిలర్లలో దహనం చేస్తున్నది. ఆ మంటలతో నీటిని మరిగించి ఆవిరిని, దాని ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నది. త్వరలో జవహర్నగర్-2 ప్లాంటు నుంచి 28 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతున్నది. మరోవైపు జవహర్నగర్ డంపింగ్ యార్డులోని చెత్తతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ)ను ఉత్పత్తి చేసే ప్రక్రియను ఇటీవల ప్రారంభించారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో..
తెలంగాణతో పోలిస్తే దేశంలోని ఇతర రాష్ర్టాల్లో, ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చెత్త నుంచి జరుగుతున్న విద్యుత్తు ఉత్పత్తి చాలా తక్కువ. గుజరాత్లో 11.5, మధ్యప్రదేశ్లో 11.5, హర్యానాలో 8 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే చెత్త నుంచి ఉత్పత్తి అవుతున్నట్టు రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రెండు చెరువులు మాత్రమే కలుషితమైనట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్లో, మధ్యప్రదేశ్, కర్ణాటకలో దాదాపు 50 చెరవులు కలుషితమైనట్టు తెలిపింది.
చెత్త గుట్టలు మాయం
సుమారు 330 ఎకరాల్లో విస్తరించి ఉన్న జవహర్నగర్ డంపింగ్ యార్డులో గతంలో టన్నుల కొద్దీ చెత్త గుట్టలుగా పేరుకుపోయి ఉండేది. దీంతో ఆ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో భూగర్భజలాలు కలుషితమయ్యాయి. చెత్తను తగులబెట్టినప్పుడు, వర్షం వచ్చినపుడు జవహర్నగర్తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా తయారయ్యేది. ఈ సమస్యను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు పూర్తిస్థాయిలో పరిష్కరించింది.
జవహర్నగర్ ప్లాంట్లో విద్యుదుత్పత్తి వివరాలు
హైదరాబాద్లో రోజూ ఉత్పత్తయ్యే వ్యర్థాలు – 5,500 టన్నులు
ఇప్పటి వరకు మండించిన వ్యర్థాలు – 1.75 లక్షలు టన్నులు
ఉత్పత్తయిన విద్యుత్తు – 56.6 బిలియన్ యూనిట్లు
పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) – 65 శాతం