ఏడ్చి మొత్తుకుంటే జనం మోసపోరు
కేసీఆర్కు ఎవరూ సాటిలేరు.. రారు
తెలంగాణ కరెంటుపై మోదీ కుట్ర
మీడియాతో మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట టౌన్, మే 15: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే విపక్ష పార్టీల నాయకుల్లో వణుకు పుడుతున్నది. పోరాడి రాష్ర్టాన్ని సాధించి, అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో చేపట్టిన అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆయనతో సరితూగే నాయకుడు యావత్ దేశంలోనే లేడు. అది జీర్ణించుకోలేకనే విపక్షాలు విషం చిమ్ముతున్నాయి’ అని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అమిత్షాది అంతా అబద్ధాల షో అని, ఆయన మాట్లాడే ప్రతి అక్షరం అవాస్తవమేనని విమర్శించారు. కేంద్ర మంత్రి హోదా మరిచి, కింది స్థాయి నాయకుడిలా దిగజారి మాట్లాడి, ప్రజల్లో నవ్వుల పాలయ్యాడని విమర్శించారు. ఆదివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. అమిత్షా వ్యాఖ్యలపై, బీజేపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. బండి సంజయ్ కొంగ జపానికి ప్రజలు మోసపోరని, ఏడ్చి బతిమాలితే పదవులు కట్టబెట్టరని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేస్తున్నదెవరో.. అభివృద్ధి నిరోధకులెవరో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు.
అమిత్షా తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని, అత్యంత అబద్ధాలు ఆడిన హోంమంత్రిగా రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్పై, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై విషం చిమ్మడం తప్ప ఆయన ఉపన్యాసంలో ఏమీ లేదని చెప్పారు. అమిత్షా తెలంగాణకు వచ్చి ఏమిచ్చిండో బీజేపీ నాయకులకైనా అర్థమైందా? అని ప్రశ్నించారు. కేంద్రం చేతకానితనం వల్లే ధరలు పెరిగాయని, ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. లక్షల కోట్ల అప్పులు చేస్తున్న కేంద్రం.. రాష్ర్టాల అభివృద్ధి కోసం అప్పులు చేయకుండా కుట్రలు పన్నుతున్నదని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో విద్యుత్తు కోతలతో చీకట్లు అలముకొన్నాయని, తెలంగాణలో కూడా విద్యుత్తు కష్టాలు వచ్చేలా బీజేపీ కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ వల్ల ముప్పు ఉన్నదని బీజేపీ నాయకులు భయంతో వణికి పోతున్నారని పేర్కొన్నారు.