BJP | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): బీజేపీలో ఓవైపు నేతల మధ్య పదవుల కోసం అంతర్గత పోరుతోపాటు మరోవైపు పైసల కోసం కొట్లాట తీవ్రంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. భార్య పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి.. రూ.100 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చే స్థాయికి ఎలా వచ్చారని తాజాగా బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మునుగోడులో రూ.100 కోట్లు పంచినా గెలువలేదంటూ కామెంట్లు చేశారు.
ఈ పైసల్లో తమకూ వాటా ఉన్నదంటూ విరుచుకుపడ్డారు. దీనిని బట్టి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ధనార్జనే ధ్యేయంగా పనిచేశారని స్పష్టమవుతున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తనకు పెద్దగా ఆస్తులు లేవని బండి సంజయ్ పదే పదే చెప్పుకొంటారు. వాస్తవం మాత్రం వేరని, మొదటి నుంచీ పైసలు దండుకొంటూనే ఉన్నారని విమర్శలు ఉన్నాయి.
ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ల హామీ పేరుతో అనేక మంది నుంచి పైసలు వసూలు చేశారని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా.. హైదరాబాద్ శివారు ప్రాంత నియోజకవర్గానికి చెందిన ఒక నేతకు టికెట్ హామీ ఇవ్వగా, అతడు కొంత ముట్టచెప్పారని, ఇదే సమయంలో మరో ముఖ్య నేత, మాజీ మంత్రి కుమారుడికి కూడా టికెట్ హామీ ఇచ్చి పాదయాత్ర, సభల ఖర్చు పెట్టించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఖర్చులను పార్టీ ఖాతాలో చూపించారనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఈటల వర్సెస్ వివేక్..
గతంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మరోనేత వివేక్ వెంటకస్వామి ఏకంగా ప్రధాని మోదీ సభ సందర్భంగా, బీజేపీ నేతల ఎదుటే వాగ్వాదానికి దిగారు. ఈ ఏడాది జనవరిలో వందేభారత్ రైలును మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వర్చువల్గా ఈ కార్యక్రమం జరగగా.. సికింద్రాబాద్లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల, వివేక్ మధ్య వాగ్వాదం జరిగినట్టు పార్టీ నేతలే వెల్లడించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటలకు వివేక్ ఆర్థికంగా సాయం చేశారు. ఎన్నికల తర్వాత తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకొన్నారు. 2021 అక్టోబర్లో హుజూరాబాద్ ఎన్నిక జరిగింది. ఆ తర్వాత వివేక్ పలుమార్లు ఈటలను పైసలు అడిగినట్టు తెలిసింది. వివేక్ ఓ దశలో ఈటలకు నేరుగా ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సన్నిహితులు చెప్తున్నారు.
దీంతో పైసలకు బదులు స్థలం రాసిస్తానని ఈటల హామీ ఇచ్చినట్టు సమాచారం. ఏండ్లు గడుస్తున్నా ఈటల ఆ హామీని కూడా నెరవేర్చలేదు. ఇటీవల మునుగోడు ఎన్నికల్లో వివేక్కు స్టీరింగ్ కమిటీ బాధ్యతలు అప్పగించడంతో పైసలు అవసరమయ్యాయి. ఈ సందర్భంగా ఈటలపై మరోసారి తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మునుగోడు ప్రచారం ఇద్దరూ కలిసి తిరిగినట్టు పైకి కనిపించినా.. తెర వెనుక మాత్రం ఎడముఖం, పెడముఖంగా ఉన్నారని కార్యకర్తలే చర్చించుకొన్నారు.
పాదయాత్ర పేరిట ధనయాత్ర
బండి పాదయాత్ర పేరుతో నిర్వహించిందంతా ‘ధనయాత్ర’ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రెండో విడుత పాదయాత్ర సమయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పిలిపించుకొని వసూళ్లకు పాల్పడ్డారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత తరుణ్ చుగ్ సైతం తోడయ్యారని, అప్పటి నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్ల దందా నడిచిందని పార్టీలోనే గుసగుసలు వినిపించాయి. దీనికి అడ్డువస్తున్నారనే కారణంతోనే ఆరెస్సెస్తో సంబంధం ఉన్న నేతలను సైతం అవమానాలకు గురిచేసి, క్రియాశీలంగా పనిచేయకుండా అడ్డుకున్నారని విమర్శలు వచ్చాయి.
రూ.2 వేల కోట్లు ఇస్తే సీఎం కుర్చీ కొనొచ్చంటూ కర్ణాటకలో ఒక బీజేపీ మంత్రి కామెంట్ చేసిన తర్వాత.. వీరిద్దరి ఆలోచన ఆ దిశగా మారిందని చెప్పుకొంటున్నారు. తాజాగా ఆ పార్టీ నేత రూ.100 కోట్ల ఆరోపణలు చేయడం అవన్నీ వాస్తవమే అనిపించేలా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తమ గెలుపు వల్లే పార్టీకి హైప్ వచ్చిందని, దానిని అడ్డుపెట్టుకొని అడ్డంగా రూ.కోట్లు వసూలు చేసుకున్నారు కాబట్టి అందులో తమకూ వాటా ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ఖర్చుల పేరుతో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నుంచి భారీగానే వసూలు చేయించినట్టు విమర్శలు ఉన్నాయి.