Bandi Sanjay | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీలోప్రధాన నిందితుడు ఎంపీ బండి సంజయ్పై సెక్షన్ 120 (బి), 477, 505, 420, 4(ఏ), 6ఆర్/డబ్ల్యూ 8 (తెలంగాణ స్టేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ప్రాక్టీసింగ్ యాక్టు 1997), 66 (డీ) ఐటీ యాక్టు-2000 వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుల్లో ఎంపీ బండి సంజయ్పై నేరం రుజువైతే సుమారు మూడేండ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉన్నది. శిక్షతో పాటుగా ఒక్కోసారి శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశాలున్నాయి. నేరం రుజువై.. కనీసం రెండేండ్ల జైలు శిక్ష పడితే.. ఎంపీగా అనర్హత వేటు వేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ నేరానికి ఏ సెక్షన్? ఏ సెక్షన్కి ఎలాంటి శిక్షలుంటాయనేది వివరంగా తెలుసుకుందాం.
ఐపీసీ సెక్షన్ 120 (బీ)
ఇది నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్. దీని కింద నేరం రుజువైతే రెండేండ్ల జైలు.. అంతకంటే ఎక్కువకాలం కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఎవరైనా నేరపూరిత కుట్రలో భాగస్వాములైనా.. నేరాన్ని ప్రేరేపించినా దీని కింద కేసు నమోదు చేస్తారు. నేరం తీవ్రతను బట్టి జైలుతోపాటు జరిమానా కూడా విధించే అవకాశాలుంటాయి.
ఐపీసీ సెక్షన్ 420
సెక్షన్ 420 మోసగాళ్లను ఉద్దేశించి నమోదు చేయబడుతుంది. ఎవరినైనా మోసం చేసినా, ఏవైనా విలువైన సమాచారం, వస్తువులు, సంతకాలు మార్చడానికి, నాశనం చేయడానికి ప్రేరేపించినా ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ ద్వారా నేరం రుజువైతే ఏడేండ్ల వరకు జైలు శిక్షను పొడిగించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.
ఐపీసీ సెక్షన్ 447
ఈ సెక్షన్ కూడా నేరపూరిత అపరాధానికి సంబంధించినదే. ఎవరైనా వ్యక్తి నేరపూరిత అపరాధానికి పాల్పడితే కనీసం మూడు నెలల వరకు పొడిగించబడే ఒక వివరణతో కూడిన జైలుశిక్షను అమలు చేస్తారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదైతే రూ.500 జరిమానా.. ప్రత్యేక పరిస్థితుల్లో జైలుశిక్ష.. రెండూ విధిస్తారు.
ఐపీసీ 505 (1)(బీ)
భారతీయ శిక్షాసృ్మతిలోని సెక్షన్ 505(1) ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పుకా ర్లు సృష్టించినా, ప్రచురించినా, ప్రసారం చేసినా ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. (బీ) రాష్ర్టానికి వ్యతిరేకంగా, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యక్తి నేరం చేయడానికి ప్రేరేపించినా, ఉద్దేశపూర్వకంగా ప్రజలలో ఏదైనా వర్గానికి భయం కలిగించే చర్యలకు పాల్పడినా ఐపీసీ 505 (1)(బీ)కింద కేసు నమోదు చేస్తారు. ఇట్లాంటి కేసులో నేరం రుజువైతే కనీసం మూడేండ్ల జైలుశిక్షను విధిస్తారు.
ఐపీసీ సెక్షన్ 4 (ఏ)
ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 4 ప్రకారం పౌరుడు.. దేశం వెలుపల, దేశం లోపల నేరాలకు పాల్పడితే.. అతనికి శిక్ష విధించడానికి ఈ సెక్షన్ను ఉపయోగిస్తున్నా రు. ఇందులో సెక్షన్ 4 నేరం చేయడానికి కంప్యూటర్ సిస్టమ్, డాటా, డాటాబేస్, సాఫ్ట్వేర్ వంటివి ఉపయోగించినా కేసు న మోదు చేస్తారు. ఇందులోనూ నేరం రుజువైతే జరిమానాతో పాటు జైలుశిక్షను విధిస్తారు.
ఐపీసీ సెక్షన్ 66 (డీ)
ఉద్దేశపూర్వకంగా నేరం చేయాలనుకున్న వ్యక్తి కంప్యూటర్ వనరులను ఉపయోగించి నేరాలకు, మోసాలకు పాల్పడితే సెక్షన్ 66 (డీ) కింద కేసు నమోదు చేస్తారు. ఈ కేసులో నేరం రుజువైతే 3 ఏండ్ల వరకు జైలు శిక్ష పొడిగింపబడుతుంది. లేదంటే రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకా శం ఉంటుంది. ఒక్కోసారి జైలుశిక్ష, జరిమా నా రెండూ విధించే అవకాశాలుంటాయి.
6 ఆర్/డబ్ల్యూ 8
ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో పాల్గొనకుండా పరోక్షంగా మోసానికి పాల్పడితే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ప్రాక్టీసింగ్ యాక్టు-1997 ద్వారా కేసులు నమోదు చేస్తారు. వీటిల్లో 6 రెడ్/విత్ 8 సెక్షన్లు ముఖ్యమైనవి. ముల్యాంకనాన్ని దొంగతనంగా రికార్డు చేయడం, తారుమారు చేయడం వంటి చర్యలను ఈ కేసుకింద పరిగణనలోకి తీసుకుంటారు. 8 ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించినా, తప్పు చేయడానికి ప్రయత్నించినా, కుట్ర చేసినా మూడేండ్ల జైలుశిక్ష విధిస్తారు. ప్రత్యేక పరిస్థితుల్లో జైలుశిక్షను పొడిగించే అవకాశం ఉంటుంది. జరిమానా కూడా రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. నేర తీవ్రతను బట్టి జైలుశిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశం ఉంటుంది.