రాంనగర్, జనవరి 3: సభలు, సమావేశాలపై నిషేధం అమల్లో ఉన్నా, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు యత్నించటమే కాకుండా, పోలీసులపైనే దాడికి దిగారని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని మూడుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోగా, పోలీసులపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించారని వెల్లడించారు. కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించిన బండి సంజయ్ను ఆదివారం రాత్రి అరెస్టు చేసిన పోలీసులు, సోమవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనతోపాటు మరో నలుగురిని పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పీటీసీ వద్ద సీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
‘ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సరికొత్త నిబంధనలు రూపొందించి రాష్ర్టాలకు మార్గదర్శకాలు ఇచ్చింది. అందులో భాగంగా హైకోర్టు సూచన మేరకు జీవో 1 ద్వారా ఆరోగ్యశాఖ సెక్రటరీ సూచనలు జారీ చేశారు. గత నెల 27 నుంచి ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించరాదని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నిబంధనలు అమల్లో ఉన్నపుడు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, మాస్క్ ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా దీక్ష చేపట్టాలని చూశారు. నిబంధన ఉల్లంఘించిన విషయంలో మూడు సార్లు వారికి పోలీస్శాఖ తరఫున నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. ఈ క్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులపై దాడులకు దిగడంతోపాటు విధులకు ఆటంకం కలిగించారు. దీంతో నేషనల్ డిజాస్టర్ చట్టం కింద, పోలీసుల విధులను ఆటంకం కలిగించారని రెండు కేసులు నమోదు చేసి 70 మందికి నోటీసులు ఇచ్చి పంపించాం. పోలీసులపై దాడి చేసి, నిబంధనలు పాటించని 16 మందిపై టూటౌన్ పోలీస్స్టేషన్లో మరో కేసు నమోదు చేశాం. ఈ కేసులో బండి సంజయ్కుమార్తో పాటు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి, పెద్దపల్లి జితేందర్, ఉప్పరపల్లి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వాసుదేవ్, రాపర్తి ప్రసాద్, పుప్పాల రఘు, శీలం శ్రీనివాస్, బొడిగె శోభ, కచ్చు రవి, బోయినపల్లి ప్రవీణ్కుమార్, మర్రి సతీశ్, దుబ్బాల శ్రీను, శ్రీకాంత్ నాయక్, కటకం లోకేశ్, అజ్మీరా హరినాయక్తోపాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశాం’ అని సీపీ పేర్కొన్నారు. బండి సంజయ్కుమార్తోపాటు పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కచ్చు రవి, మర్రి సతీశ్ను సోమవారం కోర్టులో హాజరు పరిచి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిని జిల్లా జైలుకు తరలించామని వెల్లడించారు.