నల్లగొండ, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిలదీ చెడ్డీగ్యాంగ్ నైజమనీ, వాళ్లు సీఎంలైతే రాష్ర్టాన్ని లూటీ చేయడం ఖాయమని శాసనమండలి మాజీ చైర్మన గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. అధికారంపై యావతోనే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని.. మరో పదేళ్లయినా రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ నిరుద్యోగుల్లా తిరుగాల్సిందేనని ఎద్దేవా చేశారు. సోమవారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని తన నివాసంలో గుత్తా మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం తథ్యమని, గెల్లు శ్రీనివాస్యాదవ్ భారీ మెజార్టీతో గెలువబోతున్నారని చెప్పారు. బీజేపీ నేతలు నిరాశ నిస్పృహల్లో ఉండి ఏవేవో మాట్లాడుతున్నారని, డిపాజిట్ కోసమే టీఆర్ఎస్ ఆరాటమని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్తో బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నా.. టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మీద దుష్ప్రచారాలు చేస్తూ ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. 2023లో అధికారంలోకి వస్తామంటూ చేస్తున్న ప్రకటనలు ‘ఒంటె పెదవులకు నక్క ఆశపడ్డ’ చందాన్ని తలిపిస్తున్నాయని ఎద్దేవాచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ఒక్క ప్రజాసంక్షేమ పథకాన్నైనా అమలు చేస్తున్నదా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజలపై దమనకాండ కొనసాగిస్తుంటే.. ఇక్కడేమో బండి సంజయ్ శ్రీరంగనీతులు వల్లిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులపై బీజేపీ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. సంబంధిత కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా విద్వేషపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళిత సీఎం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు.. ముందుగా దళిత వ్యక్తినే పీసీసీ అధ్యక్షుడిగా నియమించవచ్చు కదా అని ప్రశ్నించారు.