Bandi Sanjay | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): టెన్త్ పేపర్ల లీకేజీ కుట్రకోణంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ హస్తమున్నట్టు తేలింది. ప్రశ్నపత్రాల లీకేజీలో నిందితుడు ప్రశాంత్, ప్రధాన నిందితుడు బండి సంజయ్ మధ్య విస్తృతంగా ఫోన్కాల్స్ సంభాషణ జరిగినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్రశాంత్.. ఒక్క బండి సంజయ్తో మాత్రమే దాదాపు వందకు పైగా కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. పేపర్ లీకేజీలోనే వందలసార్లు మాట్లాడుకుంటే.. పరీక్షకు ముందు వీరు ఎన్నిసార్లు మాట్లాడుకొని ఉంటారు? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తున్నది. మంగళవారం బండి సంజయ్కు పేపర్ పంపించిన తర్వాత కూడా ప్రశాంత్ కాల్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. వీరు ఎక్కువగా వాట్సాప్కాల్స్ చేసుకోవటం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. ఈ వాట్సాప్ కాలింగ్లో బండి సంజయ్ ఒక్కరే ఉన్నారా? ఇంకా ఎవరైనా బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలు ఉన్నారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
పేపర్ లీకేజీలో పోలీసులు తమ ఇంటిని చుట్టుముట్టడంతో తన అరెస్టు తప్పదని భావించిన ఎంపీ బండి సంజయ్ తన రెండో ఫోన్ను రహస్యంగా దాచినట్టు సమాచారం. దీంతో ఆ ఫోన్ను వెతికే పనిలో పోలీసులున్నారు. ఆ ఫోన్ దొరికితే వరస లీకేజీలకు సంబంధించిన కీలక సమాచారం దొరికే అవకాశమున్నదని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ వాట్సాప్ చాట్ను రిట్రివ్ చేశారు. అందులోని కీలక సమాచారం ఆధారంగా బండి దాచిన మరో ఫోన్ కోసం ప్రయత్నిస్తున్నారు. పోలీసులు బండి సంజయ్ను అదుపులోకి తీసుకునే సమయంలో అతని చేతిలో ఫోను ఉన్నది. అదుపులోకి తీసుకున్న వెంటనే ఫోన్ను తన అనుచరులకు ఇచ్చి దాచిపెట్టించినట్టు సమాచారం. ప్రశాంత్ ఫోన్ నుంచి కేవలం రెండు గంటల్లోనే బీజేపీ నేతలకే దాదాపు 142 ఫోన్కాల్స్ వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు.