హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో కేంద్రమంత్రి కుమారుడు బండి సాయిభగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు హైకోర్టు అనుమతిస్తూ.. ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. భగీరథ్పై ఈ నెల 8న పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. భగీరథ్ పరారీలో ఉంటూనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ మాధవీదేవి గత శుక్రవారం రాత్రి తీర్పును రిజర్వు చేశారు. తీర్పు వెలువరించే వరకైనా అరెస్టు కాకుండా రక్షణ కల్పించాలని చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. దీంతో భగీరథ్ శనివారం పోలీసుల కస్టడీలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసులు తనను అరెస్టు చేసినందున ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతించాలని హైకోర్టుకు ఆయన న్యాయవాది లేఖ రాశారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ మాధవీదేవి గురువారం పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. పిటిషనర్కు దిగువ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.