దుండిగల్, జనవరి 18: తోటి విద్యార్థిని దూషించి దాడిచేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయిభగీరథ్ దుండిగల్ పీఎస్లో స్టేషన్ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలోని మహీంద్ర (టెక్ మహీంద్ర) వర్సిటీలో బండి భగీరథ్ తోటి విద్యార్థిని తిడుతూ దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వర్సిటీ స్టూడెంట్ అపెక్స్ కోఆర్డినేటర్ సుకేశ్ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు భగీరథ్పై వివిధ సెక్షన్ల కింద మంగళవారంకేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయమే బండి భగీరథ్ తన న్యాయవాది కరుణసాగర్తో కలిసి దుండిగల్ ఠాణాకు వచ్చారు. తనకు స్టేషన్బెయిల్ ఇవ్వాలని పోలీసులను అభ్యర్థించగా వారు తిరస్కరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని తెలుపడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ కేసులో సహకరించేందుకు తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని, ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని భగీరథ్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం.