సూర్యాపేట, మే 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాండలికాన్ని సరిగ్గా అర్థం చేసుకోని ఈసీ 48 గంటలపాటు ప్రచారం చేయకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై నిషేధం విధించడంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే రేవంత్కు నోటీసులతో సరిపెట్టి, కేసీఆర్కు మాత్రం ప్రచారంపై నిషేధం విధించడం సరికాదని అన్నారు.
అదీగాక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి క్రిషాంక్ను అరెస్టు చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. కేసీఆర్ చేపడుతున్న బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీ నేతల కాళ్ల కింద భూమి కంపిస్తుందని, అందుకే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇద్దరూ కలిసి కుట్ర చేసి ఈసీతో కేసీఆర్ ప్రచారాన్ని నిషేధించేలా చేశారని మండిపడ్డారు. గురువారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు.
మోదీ, రేవంత్ విద్వేష ప్రసంగాలు, ఫేక్ వీడియోలు ఈసీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు కార్మికుల పట్ల అవమానకరంగా మాట్లాడిన సందర్భంలో స్పందించిన కేసీఆర్ మాటలను వక్రీకరించారని పేర్కొన్నారు. కేసీఆర్ యాత్రలు చేపట్టడంతో ఛోటే భాయ్, బడే భాయ్ (రేవంత్, మోదీ)లకు వణుకుడు మొదలైందని ఎద్దేవా చేశారు.
వీధి రౌడీల్లా మాట్లాడిన రేవంత్ స్వేచ్ఛగా తిరుగుతుంటే కేసీఆర్ను మాత్రం ఇంటికే పరిమితం చేయడం సరికాదని అన్నారు. రేవంత్ తెలంగాణ సంపదను ఢిల్లీకి పంపుతున్నాడని స్వయానా మోదీ అనడం ద్వారా ఆయనకు పక్కా సమాచారం ఉన్నట్టే కదా?, అలాంటిది రేవంత్ అవినీతిపై మోదీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు చర్చకు రానీయకుండా పక్కదారి పట్టించడం కోసమే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.