బాల్కొండ ఈ-క్లాస్రూం’ యాప్
మంత్రి సొంత ఖర్చులతో రూపకల్పన
ఆవిష్కరించిన వేముల ప్రశాంత్రెడ్డి
నిజామాబాద్ క్రైం/ వేల్పూర్, జూన్ 2 : పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల సౌకర్యార్థం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తన సొంత ఖర్చులతో ‘బాల్కొండ ఈ-క్లాస్రూం’ యాప్ను తయారు చేయించారు. ఈ యాప్ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజుతో కలిసి, బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం పడగల్లోని ఉచిత కోచింగ్ సెంటర్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి వేముల గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగార్థుల సౌకర్యార్థం ఈ యాప్ను రూపొందించినట్టు చెప్పారు. ఈ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుందని, ఉద్యోగార్థులు డౌన్లోడ్ చేసుకొని వీడియో క్లాసులు వినొచ్చని సూచించారు. 57 కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా యాప్ను రూపొందించామని తెలిపారు.
జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు మేలు చేకూరాలనే ఉద్దేశంతో అన్ని వసతులతో కూడిన ఉచిత ట్రైనింగ్ను అందిస్తున్నామని చెప్పారు. యాప్ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. నాడు తెలంగాణలో కారు చీకట్లు కమ్ముకుంటాయని చెప్పిన వారే నేడు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో వెలుగులు విరాజిల్లుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మేయర్ నీతూకిరణ్, రెడ్ కో చైర్మన్ అలీం, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్టడీ మెటీరియల్ పంపిణీ
మోర్తాడ్/ ఇందూరు : నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు మోర్తాడ్ గ్రంథాలయంలో ఉద్యోగార్థులకు మంత్రి తన సొంత ఖర్చుతో నిపుణులతో తయారు చేయించిన స్టడీ మెటీరియల్ను గురువారం పంపిణీ చేశారు. స్టడీమెటీరియల్ను ఉపయోగించుకొని అభ్యర్థులు ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.