Balkampet Yellamma Temple | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 2(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన కార్యనిర్వహణాధికారి శేఖర్, సూపరింటెండెంట్ హైమావతిలను దేవాదాయశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. గత నెల 27న మంత్రి కొండా సురేఖ బల్కంపేట ఆలయంలో ఆకస్మిక తనిఖీలు చేసిన క్రమంలో అక్కడి సిబ్బంది విధుల నిర్వహణలో అలసత్వం, పారిశుధ్యం, ప్రసాదాల తయారీ తదితర వ్యవహారాల్లో లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందుకు బాధ్యులను చేస్తూ అప్పటికప్పుడే నలుగురు సిబ్బందిపై వేటు వేయగా, దేవాలయ ఈవో, సూపరింటెండెంట్లను సస్పెండ్ చేయాలంటూ ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. దీంతో సోమవారం బల్కంపేట ఇన్చార్జి ఈవో శేఖర్ను సస్పెండ్ చేస్తూ దేవాదాయ డైరెక్టర్ హన్మంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.
దేవాలయంలో ప్రీ ఆడిట్ సిస్టమ్, బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించకపోవడం, బయోమెట్రిక్ అటెండెన్స్ లేకపోవడం, లీవ్ రిజిస్టర్ మెయింటెన్ చేయకపోవడం, పాత తేదీలతో ఎంట్రీలు, బంగారం వెండి వస్తువుల నిర్వహణలో లోపాలు, క్యాష్బుక్ సరిగా లేకపోవడం వంటి ఆరోపణలతో సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం రాజకీయ కోణంలో జరిగిందని, కేవలం తమ మాట విననందుకే అధికారులను సస్పెండ్ చేయించారంటూ స్థానిక కాంగ్రెస్ నేతలపై గుసగుసలు వినిపిస్తున్నాయి.