హైదరాబాద్ : నీతి, నిజాయితీ ఉందంటున్న ఈటల రాజేందర్ ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములు ఎలా కబ్జా చేశారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే ముఠా వేణుగోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్తో కలిసి టీఆర్ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. ఈటల రాజేందర్ భార్యకు చెందిన జమున హచరిస్ భూములను ఎలా కబ్జా చేసిందో మెదక్ కలెక్టర్ ఆధారాలతో సహా చూపించారని, తప్పైందని ఈటల ముక్కు నేలకు రాయాలన్నారు.
కబ్జాలు చేసేది వీళ్లే, నోరులేని పేదల భూములను పర్యావరణానికి హాని కలిస్తారు.. మళ్లీ వీళ్లే దొంగే దొంగ అన్నట్లు ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. ఇప్పటికైనా హుజూరాబాద్ ప్రజలు ఈటల తీరును గమనించాలన్నారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు. కబ్జాకోరు, దగాకోరులాంటి వాళ్ల నిజస్వరూపాన్ని హుజూరాబాద్ ప్రజలు గమనించాలని, అక్కడి కలెక్టర్ నిజాయితీగా పని చేస్తున్నాడని, కానీ ఆయనను భయపెట్టే చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురయ్యాయో కలెక్టర్ నిగ్గు తేల్చాలన్నారు.
బీజేపీ నుంచి ఈటలను సస్పెండ్ చేయాలి : పురాణం
అధికారులు, కలెక్టర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఈటల రాజేందర్, ఆయన భార్య చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ఖండించారు. ఒక్క ఎకరానికి ఒకసారి ముక్కు నేలకు రాస్తా అన్న ఈటల 71 ఎకరాలు కబ్జా చేసినందుకు.. 71సార్లు ముక్కు నేలకు రాయాలన్నారు. భూములను కబ్జా చేసిన ఈటలను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. కలెక్టర్లను ఈటల బెదిరిస్తున్నాడని, అక్రమాలు.. అవినీతికి పాల్పడుతున్న ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రజలకు ఈటల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దున్నపోతుపై వానపడ్డట్లుంది కేంద్రం తీరు
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరు దున్నపోతు మీద వానపడ్డట్లు ఉందని బాల్క సుమన్ విమర్శించారు. ఒక వార్షిక ప్రణాళిక చేయండంటే ఆ ఊసెత్తడం లేదని, ఇన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తుంటే పట్టించుకోవడం లేదనిఆరోపించారు. మొండి వైఖరి, దుర్మార్గమైన వైఖరితో కేంద్రం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్ అసలు మనిషేనా అన్నారు. పసుపు బోర్డు తెస్తానన్న ఆయన తీసుకువచ్చాడా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ చేసిన పనులు ఏమైనా అరవింద్కు తెలుసా అని ప్రశ్నించారు.
రేవంత్రెడ్డి తెలంగాణ కోసం ఏనాడూ పని చేయలే
హైదరాబాద్ అభివృద్ధి ప్రధాత కేటీఆర్ను విమర్శించే హక్కు రేవంత్రెడ్డికి లేదన్నారు. ఆయన ఏనాడూ తెలంగాణ కోసం పని చేయలేదని ఆరోపించారు. పార్లమెంట్లో ఆందోళన చేయలేదని, ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు దావత్లు చేసుకుంటూ కూర్చున్నారని విమర్శించారు. నోట్ల కట్టలు పట్టుకొని దొరికిన దొంగ రేవంత్ అని, ఆయన కేటీఆర్పై విమర్శలు చేస్తున్నారన్నారు. వారికి కేటీఆర్పై మాట్లాడే అర్హత లేదన్నారు. టీఎస్పీఎస్ సభ్యుడిగా అవకాశం ఇచ్చి విఠల్ను టీఆర్ఎస్ గౌరవించిందన్నారు. పదవి లేకపోతే టీఆర్ఎస్ను తిట్టడమేనా అని ప్రశ్నించారు. పదవి పోగానే విమర్శించడం కొందరికి ఫ్యాషన్గా మారిందని విమర్శించారు.