కమలాపూర్, అక్టోబర్ 24: తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్, రేవంత్రెడ్డి ఒక్క పోలీస్ దెబ్బయినా తిన్నారా..?, వాళ్లపై ఒక్క కేసైనా ఉన్నదా అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. తెలంగాణ బద్ధ వ్యతిరేకి చంద్రబాబు కాళ్ల దగ్గర కాపుగాచిన రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్పై ఇష్టారీతిన మాట్లాడటంపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని స్పష్టంచేశారు. ఆదివారం కమలాపూర్లో తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన యోధుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. స్వరాష్ట్రంలో సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం వినూత్న పథకాలను అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నీటి పారుదల రంగానికి కొత్త రూపు తీసుకొచ్చారని గుర్తుచేశారు.
మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పచ్చని తెలంగాణను సాకారం చేశారని స్పష్టంచేశారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసి అడగకుండానే కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు పెట్టారని గుర్తు చేశారు. ఇలాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని.. పట్టభద్రులు ప్రజలను చైతన్య పరుచాలని పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరి, ఆత్మగౌరవం పేరుతో మొసలికన్నీళ్లు కారుస్తున్నడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.