హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీజేపీ అస్థిరపరిచే రాజకీయాలకు, టీఆర్ఎస్ అస్తిత్వరాజకీయాలకు మధ్య ధర్మయుద్ధం మొదలైందని, ఇందులో ముమ్మాటికీ విజయం సాధించేది టీఆర్ఎస్ పార్టీయేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టంచేశారు. గతంలో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి డబ్బుల సంచులు మోస్తే.. ఇవ్వాళ బీజేపీ నేతలు గుజరాత్ చెప్పులు మోస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే గణేశ్ బిగాలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్.. కక్కుర్తి కాసులకు లొంగే పార్టీ, తప్పుడు కేసులకు బెదిరే పార్టీ కాదని చెప్పారు. 8 ఏండ్లలో దేశానికి ఏం చేశారని ప్రధాని మోదీని, బీజేపీని ప్రశ్నించినందుకే నేరుగా సీఎం కేసీఆర్ను ఎదుర్కోలేక ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలకు తెగబడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ను దేశ రాజకీయాల్లో అడుగుపెట్టకుండా కట్టడి చేసేందుకే.. మోదీ, అమిత్షా కుట్రపూరితంగా ఆయన కుటుంబ సభ్యుల ఆత్మైస్థెరాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని బాల్క సుమన్ విమర్శించారు. దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ ప్రయత్నిస్తున్నారని, అందుకే అది ఏడీ (అటెన్షన్ డైవర్షన్) ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఉద్యమ బెబ్బులి అని, చెక్కుచెదరని ధిక్కారానికి ఆయన అసలు సిసలు నిదర్శనమని గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యమంలో సీఎం కేసీఆర్పై అనేక ఆరోపణలు వచ్చినా.. ఆయన ఆత్మైస్థెర్యం, ఉక్కుసంకల్పం ముందు కుట్రలన్నీ తుత్తునియలైపోయాయని బాల్క సుమన్ పేర్కొన్నారు. బీజేపీ కళంకితులకు అడ్డాగా, అక్రమార్కుల గడ్డగా మారిందని విమర్శించారు. మోదీ చర్యలతో సీబీఐ అంటే సెంట్రల్ బీజేపీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా మారిందని ఎద్దేవా చేశారు.
బూట్లు మోసుడు కాదు.. నిధులు తీసుకురా..
కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిననాడు బండి సంజయ్ నిక్కర్లు కూడా వేసుకోలేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గుజరాత్ నేతల బూట్లు మోయడం కాకుండా, తెలంగాణ రావాల్సిన నిధులను తీసుకురావాలని ఆయన బండి సంజయ్కి సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ శిఖండి రాజకీయాలు చెల్లవన్నారు. రాష్ట్రంలో హన్మంతుడి గుడిలేని ఊరు.. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు చేరని ఇల్లులేదని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సుమన్ మండిపడ్డారు. కవిత నివాసంపై బీజేపీ గూండాలు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తాము తలచుకుంటే ఏ ఒక్క బీజేపీ నేత తిరగలేరని.. తమ సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని ఆయన హెచ్చరించారు. బీజేపీ ఎన్ని చిల్లర వేషాలు ఎన్నివేసినా మునుగోడులో విజయం టీఆర్ఎస్దేనన్నారు.
రాబందుల పార్టీ బీజేపీ: బాజిరెడ్డి గోవర్ధన్
బీజేపీ రాజకీయ పార్టీలా కాకుండా రాబందుల పార్టీలా మారిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని, ప్రత్యర్థి పార్టీలను వేధించడంలో బీజేపీ గత రికార్డులను అధిగమించిందని అన్నారు. అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చటంలో మోదీ, అమిత్షా ద్వయం అరాచకాలు సృష్టిస్తున్నదని బాజిరెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అల్లర్లు, అరాచకాలకు గుజరాత్ బ్యాచ్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. మోదీ, అమిత్షాలపై దేశ ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
కార్పొరేట్ల కీలుబొమ్మ మోదీ : జీవన్రెడ్డి
ప్రధాని మోదీ కార్పొరేట్ల చేతుల్లో కీలుబొమ్మగా మారాడని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి విమర్శించారు. ప్రత్యర్థి పార్టీలను వేధించేందుకే ఈడీ, సీబీఐ, ఐటీలను బీజేపీ వాడుకుంటున్నదని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ చేరికల కమిటీలో ఆ సంస్థలు సభ్యులుగా మారిపోయాయని విమర్శించారు. బీజేపీ నాయకులే దర్యాప్తు సంస్థల అధికారుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన మండిడ్డారు. 2004-2014 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 112 సీబీఐ సోదాలు జరిగితే, ఎనిమిదేండ్ల మోదీ హయాంలో 3,010 జరిగాయన్నారు. అలాగే 22,330 ఈడీ తనిఖీలు జరిగాయని ఆయన వివరించారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఎమ్మెల్సీ కవిత జోలికొస్తే బీజేపీ బుగ్గిపాలవుతుందని ఆయన హెచ్చరించారు.
మోదీకి ఏటీఎంగా మారిన అదానీ, అంబానీ : గణేశ్ బిగాల
అదానీ, అంబానీలు ప్రధాని మోదీకి ఏటీఎంలుగా మారారని ఎమ్మెల్యే గణేశ్ బిగాల ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని, దౌర్జన్యాలకు పాల్పడేవారిని తెలంగాణ ప్రజలు తరిమికొడుతారని అన్నారు. కేసీఆర్ కుటుంబం జోలికి వస్తే తెలంగాణ అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. పదే పదే అరెస్టుల గురించి మాట్లాడటానికి సంజయ్ ఎవరని ప్రశ్నించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత… కేసీఆర్ కుటుంబ సభ్యులైనందున ప్రజాప్రతినిధులుగా నియామకం కాలేదని, ప్రజలే వారిని ఎన్నుకున్నారని ఆయన గుర్తుచేశారు. కులం, మతం భావోద్వేగాలతో బీజేపీ ఆడుతున్న ఆటలు తెలంగాణలో సాగవన్నారు.