ప్రజల సంపద, ఆస్తులను దొబ్బిపొయే నాలెడ్జ్ (కొల్లగొట్టే తెలివి) తమకు లేదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్రెడ్డికి చురకలంటించారు. సంపద పెంచడం.. ప్రజలకు పంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా కొంత మందికి పంచే కార్యక్రమం చేయబోమంటూ ఫైర్ అయ్యారు. సింగరేణి కాలరీస్ సంస్థ ప్రైవేటీకరణ, బొగ్గు గనుల వేలం అంశాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వాడీవేడీ చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్రెడ్డి ఆరోపణలపై బాల్క సుమన్ ఘాటుగా స్పందించి రాజ్గోపాల్రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సింగరేణి సంస్థ మన రాష్ట్రం దాటి ఇతర రాష్ర్టాలకు విస్తరిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెత్త ఆరోపణలు చేస్తున్నారని సుమన్ ఆరోపించారు.
నైని బొగ్గు బ్లాక్ విలువ 50 వేల కోట్లు ఉండదని, ఇలాంటిది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూ.50 వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాట్లాడటం సబబుకాదన్నారు. సభను తప్పుదోవ పట్టించరాదని సూచించారు. ఆ తర్వాత సుమన్ కేంద్రం తీరును తప్పుబట్టారు. కేంద్రం తెలంగాణపై, సింగరేణిపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిగ్నైట్ మైన్స్ను కావాలని లేఖ రాస్తే కేటాయించిన కేంద్రం, మంత్రి కేటీఆర్ లేఖ రాస్తే స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ నాలుగు బ్లాక్లు పోగా, త్వరలోనే మరో 14 బ్లాక్లను వేలం వేసే ప్రమాదముందన్నారు. ఐరన్ గనులను విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇవ్వకుండా నష్టాల బాట పట్టించి, ప్రైవేటీకరిస్తున్న కేంద్రం, అదే తరహాలో సింగరేణిని ప్రైవేటీకరించబోతోందని ఆరోపించారు. డీఎంఎఫ్ నిధులను కోల్బెల్ట్ ప్రాంతంలో ఖర్చుచేయాలని సుమన్ ప్రభుత్వాన్ని కోరారు.