హైదరాబాద్: బాలాపూర్ (Balapur) గణేశుడు అనగానే గుర్తొచ్చేది లడ్డూ. భక్తులు కొంగుబంగారంగా భావించే లడ్డూని.. వేలంపాటలో ఎంతైనా పెట్టి కొనేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం ఉదయం 9.30 గంటలకు ప్రారంభంకానుంది. ప్రస్తుతం గణనాథుడిని భజనబృందం పాటలు, డప్పు చప్పుళ్ల సందడి నడుమ బాలాపూర్ ప్రధాన వీధుల్లో ఊరేగిస్తున్నారు. అనంతరం బాలాపూర్ నడిబొడ్డున్న ఉన్న బొడ్రాయి వద్ద లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు. ఊరేగింపులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాట కొనసాగుతున్నది. మొదట రూ.450తో ప్రారంభమైన లడ్డూ వేలంపాట.. 28 ఏండ్లలో రికార్డు స్థాయికి చేరుకున్నది. గతేడాది రూ.18.90 లక్షలు పలికింది. కాగా, అయితే కరోనా కారణంగా 2020లో వేలం జరగలేదు. ఈ ఏడాది లడ్డూ కోసం తొమ్మిది మంది పోటీపడుతున్నారు. వారిలో ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు ఉన్నారు.