హైదరాబాద్, మార్చి16 (నమస్తే తెలంగాణ): సంచార కులాల జీవన స్థితిగతులపై శాస్త్రీయమైన అధ్యయనం చేయాలని జాతీయ డీఎన్టీ (డీనోటిఫైడ్ ట్రైబ్స్) కమిషన్ మాజీ చైర్మన్ బాలకృష్ణ రెనకె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావును గురువారం ఖైరతాబాద్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కృష్ణమోహన్రావుతో పాటు కమిషన్ సభ్యుడు కిషోర్గౌడ్, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ దేశంలో ఎకడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రం అమలు చేస్తున్నదని ప్రశంసలు కురిపించారు. బీసీ-ఏ గ్రూప్లో ఉన్న సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు ఆదర్శవంతంగా ఉన్నాయని కొనియాడారు. ఇప్పటికీ కొన్ని సంచార కులాలు ఆ పథకాల లబ్ధిని పొందలేకపోతున్నాయని, వాటిపై సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సిఫారసులు చేయాలని కోరారు. కార్యక్రమంలో సామాజికవేత్తలు ఆచార్య ఐ తిరుమలి, ఆచార్య చెన్న బసవయ్య, ఒంటెద్దుల నరేందర్, తిపిరిశెట్టి శ్రీనివాస్, వై వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.