Bakka Judson | ఖైరతాబాద్, ఏప్రిల్ 3: అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7వేల కోట్లు విడుదల చేసిందని, అవి ఏం చేశారో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. జడ్సన్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆయా పార్టీల నుంచి సంచార రాజకీయ నాయకులు కనీసం ఐడియాలజీ తెలియని వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే దానిని ప్రశ్నించినందుకు తనను సస్పెండ్ చేశారని తెలిపారు.
రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, ఖాళీలు భర్తీ చేయాలని, మెగా డీఎస్సీ వేయాలని, ఉద్యోగ కల్పన చేపట్టాలని ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టో కమిటీ కోరిందని, ఉచిత బస్సు, ఉచిత కరెంటు ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం విడుదల చేసిన రూ.7వేల కోట్లను నాడు కోడ్ పేరుతో ఎన్నికల కమిషన్ ఆపిందని, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి వందరోజులు దాటిందని, ఆ సొమ్ము ఎవరి అకౌంట్లోకి వెళ్లాయి, ఎవరికి బిల్లులు చెల్లించారు, రైతుల నోట్లో మట్టి కొట్టి ఏ కార్పొరేట్ కంపెనీ నోట్లో ఈ పైసులు గుక్కారో చెప్పాలని అన్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రేవంత్రెడ్డి ఆయనను బడేభాయ్ అంటూ సంబోధించారని, రాష్ట్రంలో అత్యధిక సీట్లలో బీజేపీని గెలిపించేందుకు కంకణం కట్టుకున్నారని జడ్సన్ ఆరోపించారు. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో కాంగ్రెస్ నుంచి బలహీనమైన వారికి టికెట్లు ఇచ్చారని అన్నారు. అంటే బడేభాయ్కి ఈ చోటేభాయ్ సద్ది కడుతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ ఎన్నికలు రెఫరెండం లాంటివని, 14 సీట్లు గెలవకపోతే పదవి ఊడిపోయే అవకాశం ఉందని జడ్సన్ స్పష్టం చేశారు.