బాఖర్ అలీ మిర్జా హైదరాబాద్ నిజాం ప్రభుత్వ స్కాలర్షిప్ పొంది, ఉన్నత చదువుల కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ చదువుతున్న రోజుల్లో ఆధునిక భావాల ప్రభావంతో సోషలిస్ట్ సమాజం కోసం కృషి చేయడం మొదలుపెట్టాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ‘భారత్ మ్యాగజైన్’ పత్రికను నిర్వహించారు. తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏ లో చేరారు. ఫ్రాంక్ఫర్డ్లో పీహెచ్డీ పూర్తి చేశారు. చదువుకుంటున్న రోజుల్లో.. పరాగ్వేలో జరిగిన అంతర్జాతీయ విద్యార్థి సభల్లో పాల్గొన్నారు. స్కాలర్షిప్ ఒప్పందం ప్రకారం ఉన్నత విద్యానంతరం ఆయన నిజాం ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరాలి.
కానీ, ఆయన సామ్యవాద భావాలు కలిగిన వ్యక్తి. ఆ కారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే సామ్యవాద భావాలను వదులుకుంటానని, అలాంటి సంస్థలతో సంబంధాలు పెట్టుకోనని, విదేశీ స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపనని హామీ ఇవ్వాలని ప్రభు త్వం ఆంక్షలు పెట్టింది. తన భావా లు మార్చుకోనని ఆయన కరాఖండిగా చెప్పేశారు. 1927లో బ్రస్సెల్స్లో జరిగిన సామ్రాజ్యవాద వ్యతిరేక అంతర్జాతీయ మహాసభలో బాఖర్ అలీ పాల్గొన్నారు. అదే మహాసభలో భారత ప్రతినిధిగా జవహర్లాల్ నెహ్రూ పాల్గొన్నారు. వీరిద్దరి పరిచయం స్నేహానికి దారి తీసింది. అప్పటి నుంచి ఆయన నెహ్రూతో స్నేహాన్ని చివరి దాకా కొనసాగించారు. నెహ్రూ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో కార్మికుల అధ్యయన కేంద్రానికి కోశాధికారిగా చేరారు. బెంగాల్ జ్యూట్ కార్మిక సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. స్వాతంత్య్రానంతరం మూడో లోక్సభకు వరంగల్ నియోజక వర్గం నుంచి, నాలుగో లోక్ సభకు సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి గెలుపొందారు.