హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఏం జరిగిందో అందరికీ తెలుసు.. జరిగిన సంఘటనపై ప్రభుత్వం, సంస్థల యాజమాన్యాలు చిటికెలో స్పందించిన వైనం కూడా సర్వత్రా ఎరుకే. మరమ్మతులకు ఎంత ఖర్చు అయ్యిందో అధికారులే స్పష్టంగా చెప్తున్నారు.. ఆలస్యానికి కారణం కూడా అందరికీ అనుభవమున్నదే.. అయినా అదే కక్ష.. అదే విష ప్రచారం.. తెలంగాణ విద్యుత్తు సంస్థలపై ఒక వర్గం మీడియా మరోసారి విషం కక్కే ప్రయత్నం చేసింది. శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో నాలుగో యూనిట్ పునరుద్ధరణకు కారణాలు తెలిసినప్పటికీ ఓ పత్రిక దుష్ప్రచారానికి దిగింది.
ప్లాంట్ను కాపాడేందుకే ప్రాణత్యాగం
2020 ఆగస్టు 20న సాయంత్రం శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలోని నాలుగో యూనిట్ వద్ద చోటుచేసుకొన్న అగ్నిప్రమాదంలో ఇంజినీర్లు, సిబ్బంది కలిసి మొత్తం 9 మంది ప్రాణాలు పోగొట్టుకొన్నారు. సంఘటన సమాచారం తెలియడంతోనే విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుసహా ఉన్నతాధికారులు, ఇంజినీర్లు శ్రీశైలంకు వెళ్లారు. అక్కడే ఉండి ఉద్యోగుల ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, జల విద్యుత్తు ప్లాంట్ను కాపాడే క్రమంలో 9 మంది అమరులయ్యారు. వారి త్యాగాన్ని తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఉద్యోగ సంఘాలు, అధికారులు, సంస్థలు, ప్రజలు కూడా కొనియాడారు.
70-80 కోట్లే
నాలుగో యూనిట్కు విదేశీ సంస్థలు, నిపుణులతో మరమ్మతులు చేయిస్తే భారీగా ఖర్చు అయ్యేది. కానీ మన సొంత ఇంజినీర్లు తమ మేధస్సుకు పనిచెప్పటంతో రూ.70- 80 కోట్ల ఖర్చు మాత్రమే అయ్యిందని జెన్కో ఉన్నతాధికారులు చెప్తున్నారు. కానీ దుష్ప్రచారానికి దిగిన ఓ పత్రిక మాత్రం ప్రమాదం కారణంగా రూ.వెయ్యి నుంచి రూ.2 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు కథనాలు రాయడంతో విద్యుత్తు సంస్థల ఉద్యోగులు విస్తుపోతున్నారు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల ఆత్మైస్థెర్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నాలుగో యూనిట్లో అత్యంత కీలకమైన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ ‘ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఎలక్ట్రికల్స్ కేరళ లిమిటెడ్ (టెల్క్) నుంచి రావడమే ఆలస్యమైంది. అక్కడ భారీ ఆర్డర్లు ఉండటంతోపాటు.. కరోనా ప్రభావం కూడా పడటంతో ఆలస్యంగా ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. ప్రస్తుతం యూనిట్ మరమ్మతు పనులు దాదాపు పూర్తయ్యాయి.
డిజైన్కంటే ఎక్కువ ఉత్పత్తి
శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో 150 మెగావాట్ల చొప్పున 6 యూనిట్లు నిర్మించారు. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 1,400 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేలా డిజైన్ చేశారు. అయితే 2020లో నాలుగో యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ, కేవలం 5 యూనిట్ల ద్వారానే 2020-21లో 1,231.62 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం గమనార్హం. ఆ తరువాత కూడా అంతకు మించి విద్యుత్తును ఉత్పత్తి చేసింది. ఒకపక్క నాలుగో యూనిట్ మరమ్మతులు చేస్తూ మరోవైపు మిగిలిన ఐదు యూనిట్లలో భారీగా జల విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా రాష్ట్రంపై వందల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని తగ్గించారు. ఇవేమీ పట్టించుకోకుండా ఇంజినీర్లు, ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా భారీ నష్టం జరిగినట్టుగా కథనాలు రాయడం వెనుక దురుద్దేశమే తప్ప.. రాష్ర్టానికి ప్రయోజనం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనాతోనే ఆలస్యం
నిజానికి ప్రమాదం జరిగిన సమయంలో ప్రపంచం యావత్తూ కరోనాతో పోరాడుతున్నది. మనదేశంలో, రాష్ట్రంలోనూ కరోనా తీవ్రంగా ఉన్నది. ఆ సమయంలో ప్లాంటు మరమ్మతుల కోసం విదేశీ నిపుణులు వచ్చేందుకు వెనుకాడారు. దీంతో మన విద్యుత్తు సంస్థల ఇంజినీర్లే కష్టపడి మరమ్మతులు ప్రారంభించారు. 1, 2 యూనిట్లను కొద్ది నెలల్లోనే పునరుద్ధరించి ప్రారంభించారు. 3, 5, 6 యూనిట్లను కూడా వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన 4వ యూనిట్లో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా కాలిపోయింది. దీనిని కేరళ టెల్క్లో తయారుచేసేందుకే ఎక్కువ సమయం పట్టింది. పైగా కరోనా రెండో, మూడో వేవ్స్ ప్రభావం కూడా దీనిపై పడింది. ఈ నేపథ్యంలోనే నాలుగో యూనిట్ పునరుద్ధరణ ఆలస్యమైంది.
ప్రమాదం తరువాత విద్యుత్తు ఉత్పత్తి ఇలా..
సంవత్సరం : ఉత్పత్తి (మిలియన్ యూనిట్లలో)
2020-21 : 1,231.62
2021-22 : 2,076.30
2022-23 : 2,104.79