హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా వెంటనే బీసీల కుల గణన చేపట్టాలని, జాతీయ స్థాయిలో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల జనాభా దామాషా ప్రకారం 56 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ సభలో కోరారు. కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన చేపట్టకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నారు. పార్లమెంట్లో బీసీల సమస్యలపై కేంద్రంతో పోరాటం చేస్తామని తెలిపారు. బీసీ జన గణన కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తుచేశారు. బీసీ గణన చేపట్టాలని 240 బీసీ కమిషన్లు సిఫారసు చేసినా కేంద్రప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జంతువుల సంఖ్యను లెక్కిస్తున్న మోదీ సర్కారు, బీసీల సంఖ్యను లెకించకుండా అవమానిస్తున్నదని మండిపడ్డారు.
లేదంటే ఢిల్లీ కోటపై దండయాత్ర తప్పదు:జాజుల
జాతీయ జనగణనలో బీసీ కులగణనను తప్పక నిర్వహించాల్సిందేనని జాతీయ ఓబీసీ మహాసభ డిమాండ్ చేసింది. లేదంటే ఢిల్లీ కోటపై బీసీల దండయాత్ర తప్పదని హెచ్చరించింది. ఢిల్లీలోని తలకటోర స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హాజరై మాట్లాడారు. బీసీ కులగణన, చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించాలని, లేదంటే రైతు ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్తో పాటు, అన్ని రాష్ర్టాల బీసీ సంఘాల ప్రతినిధులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.