హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటుచేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. మూడు రోజులు విస్తారమైన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉధృతంగా ప్రవహించే కాజ్-వేలు, కల్వర్టులు, వంతెనల వద్ద భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని చెప్పారు. వర్ష, వరద ప్రాభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత, సహాయక శిబిరాలను తరలించాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాలకు అగ్నిమాపక, పోలీసు బృందాలను మోహరించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లు, మ్యాన్-హోళ్లపై కప్పులు తెరవకుండా నగరవాసులను చైతన్య పర్చాలని ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్లో డీజీపీ అంజనీకుమార్, ఎస్సీఎస్లు తదితరులు పాల్గొన్నారు.