అంబేద్కర్ అనగానే అందరూ రాజ్యాంగ ముసాయిదా రచన సంఘానికి అధ్యక్షుడుగా చేసిన కృషినే ప్రధానంగా గుర్తు చేసుకొంటారు. న్యాయవేత్తగా, రాజ్యాంగ నిపుణునిగా ప్రస్తుతిస్తారు. దళిత, బహుజనుల విమోచనకు తపించిన దార్శనికునిగా స్మరిస్తారు. కానీ ఆయన బహుముఖీన నాయకుడు. ఆర్థికవేత్తగా, పరిపాలనా సంస్కర్తగా ఆయన తెచ్చిన మార్పులు ఆధునిక భారతానికి మార్గదర్శకాలయ్యాయి. నీటిపారుదల, రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు, కార్మికుల స్థితిగతుల మెరుగుదల, మునిసిపల్ పరిపాలన వంటి అంశాల్లో ఆయన వేసిన పునాదులు నేటికీ నిలిచి ఉన్నాయి. ఆయనలోని న్యాయ నిపుణత గురించి తెలిసినంతగా వీటి గురించి నేడు అంతగా తెలియదు. స్వాతంత్య్రం రాకముందే దేశంలోని కీలక రంగాలకు ఆయన పునాదులు వేశారు. 1942 నుంచి 1946 వరకు ఆయన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక విభాగ సభ్యుడుగా పనిచేశారు. ఆ హోదాలో ఆయన నీటిపారుదల, కార్మక సంస్కరణల వంటి విభిన్న రంగాలకు సేవలందించారు. నూతన వ్యవస్థలకు పునాదులు వేశారు.
రిజర్వ్ బ్యాంకు ఏర్పాటులో కీలకపాత్ర
అంబేద్కర్ న్యాయశాస్త్రంతో పాటుగా అర్థశాస్ర్తాన్ని లోతుగా అధ్యయనం చేసి అత్యున్నతమైన డాక్టరేట్ పట్టా పొందారు. ఇలా రెండు రంగాల్లో ఉన్నత చదువులు చదవిన వారు అరుదుగా ఉంటారు. ఈ అంశంపై ఎన్నో కీలక పుస్తకాలు కూడా రాశారు. భారతీయ కరెన్సీ, ఆర్థిక వ్యవస్థపై ఏర్పాటైన హిల్టన్ యంగ్ కమిషన్కు ఆయన సమర్పించిన మార్గదర్శకాల ఆధారంగానే రిజర్వ్ బ్యాంకు ఏర్పాటైంది. అంబేద్కర్ అంతకుముందే రాసిన రూపాయి – దాని మూలం మరియు పరిష్కారాలు అనే పుస్తకం ఆధారంగా ఆయన ఆ మార్గదర్శకాలను క్రోడీకరించారు. అంటే రాజ్యాంగ రచనా సారథిగామాత్రమే కాకుండా ఆర్బీఐ వంటి కీలక సంస్థ ఏర్పాటులో అతిముఖ్యమైన పాత్ర పోషించారన్నమాట.
బహుళార్థ సాధక ప్రాజెక్టుల ప్రతిపాదకుడు
వైస్రాయ్ కౌన్సిల్ సభ్యునిగా ఆయన దేశానికి నూతన జల, విద్యుచ్ఛక్తి విధానాన్ని రూపొందించారు. జలవనరులను దేశ ప్రజలందరికీ ప్రయోజనకరంగా మలచాలని తపించారు. అందుకు ఆయన అమెరికాలోని టెన్నెస్సీ వ్యాలీ ప్రాజెక్టును లోతుగా అధ్యయనం చేశారు. బహుళార్థ సాధక ప్రాజెక్టుల భావనకు ఆయనే ఆద్యుడు. నదిపై ఆనకట్ట కట్టి సాగునీరు, తాగునీరు అందించడం, కరవులను నివారించడం, నిరంతర విద్యుచ్ఛక్తిని అందించడం, భారతదేశ పేదప్రజల జీవనప్రమాణాలను మెరుగుపర్చడం అనే లక్ష్యంతో ఆయన బహుళార్థ సాధక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. దామోదర్ లోయ ప్రాజెక్టులతో సహా అనేక ప్రాజెక్టులకు అంకురారోపణ జరిగింది ఆయన ఆలోచనలతోనే.
పనిగంటలు తగ్గించిన కార్మిక పక్షపాతి
వైస్రాయ్ కౌన్సిల్ సభ్యునిగా (ఇప్పటి కేంద్రమంత్రి పదవి లాంటిది) డాక్టర్ అంబేద్కర్ అనేక రంగాలను ప్రభావితం చేశారు. ముఖ్యంగా మనదేశంలో కార్మిక సంస్కరణలకు ఆయనే ఆద్యుడు. పనిగంటలను 12 నుంచి 8కి తగ్గించడం, కరువుభత్యం, సెలవులు, కార్మిక బీమా, మెడికల్ లీవ్, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం, కాలానుగుణంగా జీతాల సవరింపు వంటివి ఆయన ప్రవేశపెటచ్టిన కార్మక సంస్కరణలో అతిముఖ్యమైనవి.
మహిళా సంక్షేమానికి ఆద్యుడు
ఒక దేశ ప్రగతిని ఆ దేశంలోని మహిళల ప్రగతిని బట్టే అంచనా వేయాలని చెప్పిన అంబేద్కర్ వారి సంక్షేమం కోసం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ప్రసూతి సెలవులు, పురుషులతో సమాన పనికి సమాన వేతనాలు, మహిళా కార్మికులకు సంక్షేమనిధి ఏర్పాటు వంటివి ఆయన స్వాతంత్య్రం రాకముందే సాధించారు.