హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ విమర్శించారు. ఈ నెల 18 నుంచి ఈ సమావేశాలను నిర్వహించేందుకు కేంద్రం ఇప్పటికే అఖిలపక్ష భేటీని నిర్వహించింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన ఎజెండాలోని అంశాల గురించి అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీలకు వివరించిన మోదీ సర్కారు.. బుధవారం తాజాగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జరిగే కార్యకలాపాలకు సంబంధించిన బులెటిన్ను విడుదల చేసింది.
ఇందులోని అంశాలకు, అంతకుముందు అఖిలపక్ష భేటీలో కేంద్రం చెప్పిన అంశాలకు చాలా వ్యత్యాసం ఉన్నదని వినోద్కుమార్ తెలిపారు. ప్రత్యేక సమావేశాల్లో చర్చించాలని భావిస్తున్న అంశాలను ప్రభుత్వం ముందుగానే అన్ని రాజకీయ పార్టీలకు వెల్లడించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. ఆ ఎజెండాను ఖరారు చేయకుండా జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని, ఇండియా పేరును భారత్గా మారుస్తామని కేంద్రం దాటవేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ను దేశమంతా గమనిస్తున్నదని, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని వినోద్కుమార్ హెచ్చరించారు.