B Vinod Kumar | సైనికుల్లా పని చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు వివరించేందుకు ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిగా ఉన్న గంభీరావుపేట మండలం.. ప్రస్తుతం సస్యశ్యామలంగా మారిందని గుర్తు చేశారు.
విదేశాల్లో ఉన్నత విద్యనందించేందుకు విద్యార్థులకు రూ.20లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉండాలనే సంకల్పంతో ప్రతి జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రతి సంవత్సరం పదివేల మంది వైద్యులు రాష్ట్రానికి అందుబాటులోకి వస్తున్నారని తెలిపారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీతో పాటు 500 పడకలు ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయని, భవిష్యత్తులో వైద్యపరంగా ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎక్కడికక్కడే వైద్యసేవలు అందించేందుకు ఎంతగానో దోహదపడుతాయన్నారు.
ఆసరా పథకం కింద ఇచ్చే పెన్షన్ల నగదును సీఎం కేసీఆర్ పెంచారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్లు పెంచనున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విభిన్న కోణంలో ఆలోచించి.. విశ్లేషించి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తున్నారన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా మారి రాష్ట్ర ప్రభుత్వ పనులను ప్రజలకు వివరించి.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.