వరంగల్: వేధింపులు తాళలేక ప్రాణాలు క్పోలోయిన ప్రీతి అంత్యక్రియలు ముగియకముందే వరంగల్లో మరో దారుణం వెలుగుచూసింది. రాహుల్ అనే యువకుడి వేధింపులు భరించలేక రక్షిత అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లికి చెందిన పబ్బోజు శంకర్, రమాదేవి దంపతుల కూతురు రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ థర్డ్ ఇయర్ చదువుతున్నది. స్వగ్రామంలో పదో తరగతి చదివే రోజుల్లో ఆమెకు పరిచయమైన రాహుల్ అనే యువకుడు ఆమెను గత కొన్నాళ్లుగా వేధిస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో దిగిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని అమ్మాయి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇదే విషయాన్ని రక్షిత తన కుటుంబ సభ్యులకు చెప్పగా వారు భూపాలపల్లి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. దాంతో పోలీసులు రాహుల్ను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు రక్షిత కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తున్నది. అయినా అతడిలో ఏ మాత్రం మార్పు రాకపోగా.. ఇటీవల రాహుల్ వేధింపులు శ్రుతి మించాయి. ఈ క్రమంలో శివరాత్రికి భూపాలపల్లికి వెళ్లిన రక్షిత.. కాలేజీకి పోతున్నానని చెప్పి ఇంట్లోంచి బయలుదేరింది. కానీ ఆమె కళాశాలకు వెళ్లలేదు. తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత రెండు రోజులకు విద్యార్థిని ఇంటికి తిరిగొచ్చింది. దాంతో కూతురు ఇంటికి తిరిగి వచ్చిందని రక్షిత పేరెంట్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా రక్షిత తండ్రి శంకర్ ఆమెను హాస్టల్లో నుంచి తీసేసి.. వరంగల్ రామన్నపేటలోని తన సోదరుడి ఇంట్లో పెట్టాడు. అక్కడి నుంచే ఆమె రోజూ కాలేజీకి వెళ్లి వస్తోంది. మిస్సింగ్ కేసుకు సంబంధించి రక్షిత సోమవారం పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి ఉండగా ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది.
దాంతో రాహుల్ వేధింపులతోనే తమ కుమార్తె రక్షిత ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.