హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): కేంద్రం ప్రకటించిన పీఎం సూర్య ఘర్ ఉచిత సోలార్ విద్యుత్తు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బీ అశోక్కుమార్ కోరారు. దీనివల్ల సోలార్ విద్యుదుత్పత్తి గణనీయంగా పెరుగుతుందని, తద్వారా రాష్ట్రంలో లక్షలాది విద్యుత్తు వినియోగదారులకు మేలు కలుగుతుందని చెప్పారు.
హైదరాబాద్ ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో మంగళవారం పీఎం సూర్య ఘర్ బిజిలీ యోజన అమలుపై జరిగిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన సోలార్ యూనిట్ల కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. వారికి ఈ సందర్భంగా అశోక్కుమార్ పథకంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ను ఇచ్చారు. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిని పెంచేందుకు సోలార్ విద్యుదుత్పత్తిని విస్తృత్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.